ఏపీ ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు వివాదంలో ఇరుక్కున్నారు.ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది.చంద్రబాబు భక్తుడిగా పేరున్న ఆయనకు సంబంధించి విస్మయకర రీతిలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆయన డిగ్రీ సర్టిఫికెట్ అన్నది ఫేక్ అని, ఆ సర్టిఫికెట్ తోనే ఆయన వాణిజ్య పన్నుల విభాగంలో ఉద్యోగం పొందారని ఎప్పటి నుంచో ఓ వాదన నడుస్తోంది.గతంలోనూ ఈయన విద్యార్హతలపై పలు అనుమానాలూ,ఆరోపణలూ ఉన్నా ఏ ప్రభుత్వమూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు సరికదా కనీసం శాఖ పరమైన విచారణకు కూడా ఆదేశించలేదు.ఈ దశలో అశోక్ బాబుపై పలు సార్లు సొంత శాఖ ఉద్యోగులే తిరుగుబాటు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో వెలుగులోకి వచ్చిన అశోక్ బాబు ఉద్యోగ విరమణ చేశాక ఎంఎల్సీ అయ్యారు.
ఇప్పటికిప్పుడు ఆయనపై నమోదు అయిన కేసులో ఎటువంటి పురోగతి ఉంటుందో అన్న విషయం తేల్చలేం. కానీ రాజకీయంగా ఆయన ఈ విషయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో అన్నదే ఇప్పుడిక ఆసక్తిదాయకం. ఆయనపై 447ఎ, 465, 420 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని ప్రధాన మీడియా వెల్లడిస్తోంది.ఆయన చదివించి డిప్లమా ఇన్ కంప్యూటర్స్.. కానీ తప్పుడు బీకాం సర్టిఫికెట్ తో పదోన్నతులు పొందారు. ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షుడిగా చెలామాణీ అయ్యారు. కేవలం వాణిజ్య పన్నుల కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం కోసమే ఆయన ఇదంతా చేశారన్న ఆరోపణలు పలుసార్లు వెలుగులోకి వచ్చాయి. సర్వీసు రిజిస్టర్ లో తన క్వాలిఫికేషన్ ను అత్యంత చాకచక్యంగా మార్చడంతోనే ఆయన ఆశించిన విధంగా ఉద్యోగోన్నతి పొందడమే కాకుండా తమ సంఘంలో ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకున్నారన్నది ఇప్పటిదాకా ఆయనపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేసే అభియోగం.