దండగమారి ఆలోచనల కారణంగా కాలం వృథా తప్ప జగన్ సాధించింది ఏమీ ఉండదు అని రేపటి వేళ తేలిపోతుంది. పరిపాలన సౌలభ్యం కోసమే కదా గ్రామ సచివాలయాల ఏర్పాటుచేసింది. అయినా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన రేపు జరుగుతుంది కదా! అప్పుడేం చేస్తారని? జన గణన జరగమునుపే జగన్ గణన మొదలయిపోయిందని అనుకోవాలా?
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎం జగన్ ఇచ్చిన ప్రకటన అందరినీ కాకపోయినా కొందరిని అయినా సంతృప్తి పరిచింది అనే చెప్పాలి.పేర్ల విషయమై కాస్తో కూస్తో రగడ అయితే నెలకొందేమో కానీ అంతా ఊహించిన విధంగా జగన్ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదన్న విధంగానే జిల్లాల ప్రకటనకు సిద్ధం అయ్యారు.కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మాకు అనగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చే లాభం ఏంటి? ఏమీలేదు. పోనీ కరువుతో అల్లల్లాడే సీమ జిల్లాలకు ఏమయినా లాభం ఉంది అంటారా? ఏముందని అవే పార్లమెంట్ నియోజకవర్గాలు అవే రెవెన్యూ డివిజన్లు. జగన్ ను ఇవి ఎవరు అడిగారు? వీటి నిర్వహణకు కొత్త కలెక్టరేట్ల ఏర్పాటుకు ఇప్పుడున్న సమయంలో సాధ్యం అవుతుందా?
పది జిల్లాల తెలంగాణ ను 33 జిల్లాలుగా మార్చారు కేసీఆర్. దీని వల్ల అక్కడ వచ్చిన కొత్త ప్రగతి ఏమీ లేదు. జిల్లాల ఏర్పాటు దండగ మారి వ్యవహారమే అని తేలిపోయింది. జిల్లాలు కాదు కనీస వసతులు కావాలి అని అడిగితే అక్కడ కూడా ఇలానే దాటవేత ధోరణిలోనే ప్రభుత్వాలు ఉన్నాయి.ఈ దశలో కేసీఆర్ కొత్తగా సాధించిన వివరం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇదే దశలో అదనపు ఖర్చు తప్ప! కార్యాలయ నిర్వహణ భారం ఎవరు మోస్తారని? ఎందాక బిక్కు బిక్కు మని సరైన కార్యాలయాలు లేని చోట పనిచేస్తారని? అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ సమర్థ రీతిలో పట్టిష్టం అయిన భవనాల్లో నడుస్తున్న తహశీల్దారు కార్యాలయల సంఖ్య ఎంతని?