నిన్న‌టి వేళ హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు క‌ల‌బోసిన నేత.వివాదాల‌కు అతీతంగా రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉన్న ఏకైక నేత‌.తెల్లారితే నోరేసుకుప‌డిపోయే మంత్రులున్న  వైసీపీ క్యాబినెట్ లో విల‌క్ష‌ణ వ్య‌క్తిత్వం,విభిన్న త‌త్వం ఉన్న నేత.ముఖ్యంగా ఈ రోజుల్లో వివాదాల‌కు దూరంగా ఉండే నేత‌లే అరుదు.బాగా చ‌దువుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నేత‌లు ఇంకా అరుదు.నెల్లూరు కేంద్రంగా కూడా రాజ‌కీయాలు ఎంతో హుందాగానే న‌డిపారు.అస్స‌లు ఆయ‌న రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌నూ ఇత‌ర సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌నూ ఏనాడూ వేర్వేరుగా చూడ‌లేదు అని అంటారు.శ్రీకాకుళంకు చెందిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సైతం వివాదాల‌కు అతీతుడిగానే ఉంటూ ఆయ‌న రాజకీయ రంగంలో రాణించేందుకు ప్ర‌య‌త్నించార‌ని నివాళి అర్పిస్తూ చెప్పారు.

తెల్లారితే చాలు మీడియా ముందుకు వ‌చ్చి చంద్ర‌బాబును నోటికివ‌చ్చిన విధంగా తిట్టే కొడాలి నాని కానీ ఇత‌ర నాయ‌కులు కానీ ఆయ‌న్నుంచి నేర్చుకోవాల్సిన‌వి ఎన్నో! హుందాత‌నంగా ఆయ‌న న‌డ‌వ‌డి ఉంటే, అందుకు అనుగుణంగా ఆయ‌న మాట కూడా ఉండేది.అసెంబ్లీలో మాట్లాడినా,దేశ విదేశాల్లో మాట్లాడినా ఒకే విధంగా అణ‌కువ‌తో కూడిన మాట‌నే వెల్ల‌డి చేసేవారు. అస‌లు ప‌రుషంగా ఆయ‌న మాట్లాడిన దాఖలాలు లేనే లేవు. ఆ ఇంటి డ్రైవ‌ర్ల‌ను కూడా గౌర‌వంగానే చూసేవారు అన్న‌ది నిన్న‌టి వేళ
వినిపించిన మాట.

ఇక వ్య‌క్తిగ‌త విష‌యాల్లోకి వెళ్తే..
ఆయ‌న అమ్మ చాటు బిడ్డ.ఎక్క‌డికి పోయినా త‌న మాతృమూర్తి ఆశీర్వాదం లేనిదే ఆయ‌న బ‌య‌ట‌కు వెళ్ల‌రు. అమ్మ మాట జ‌వ‌దాటే వారు కాదు అనికూడా ప్ర‌ధాన మీడియా వెల్ల‌డి చేస్తున్న మాట. అదేవిధంగా రాజ‌కీయాల్లోకి నాన్న ఆశ‌యాల మేర‌కు,ఆకాంక్ష‌ల మేర‌కు వ‌చ్చినా కూడా ఏనాడు తండ్రికి చెడ్డ‌పేరు తీసుకురాలేదు. ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి పాటుప‌డే విష‌య‌మై తీసుకోవాల్సిన శ్ర‌ద్ధ విడిచిపోలేదు.మ‌రిచిపోలేదు. అదేవిధంగా ఆయ‌న‌కు తండ్రి అంటే ప్రాణం అని,తొలి నాళ్ల‌లో ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి అని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిస్తోంది. ఏటా తిరుప‌తికి వస్తుండడం కూడా ఓ ఆన‌వాయితీ ఆయ‌న‌కు అని, మొన్న‌టి సంక్రాంతి వేళ‌ల్లో 3 రోజుల పాటు తిరుమ‌ల‌లోనే గ‌డిపార‌ని కూడా మీడియా వెల్ల‌డిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: