మెగా కుటుంబంలో కలతలు రేపేందుకే మంత్రులు ప్రయత్నిస్తున్నారా? అసలు వీళ్లకు పాలనపై ఏమయినా అవగాహన ఉందా? వీళ్లు వాడే భాషను మేం వాడలేమా? అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. పవన్ అభిమానులు కూడా జగన్ ను ఉద్దేశించి ఇదేవిధంగా తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు సోషల్ మీడియాలో..! గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ సినిమా ఇన్ని వివాదాలకు ఆనవాలు ఇచ్చిన దాఖలాలే లేవని, తమ అధినేతను రాజకీయంగానే ఎదుర్కొనే దమ్ములేకే, సినిమాలపై సంబంధిత ప్రదర్శన వ్యవస్థపై వేధింపు చర్యలకు పాల్పడుతున్నారని జనసేన అభిమానులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో నాగబాబు వ్యాఖ్యలు కొత్త వివాదానికి తావిస్తున్నాయి.
భీమ్లా నాయక్ వివాదం ఇప్పట్లో తీరేలా లేదు.రోజుకో దుమారం రేపుతూనే ఉంది.ముఖ్యంగా మెగా కుటుంబం నుంచి నాగబాబు ఒక్కరే తీవ్రంగా స్పందిస్తున్నారు.నిన్నటి వేళ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో,తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.ఇదే సందర్భంలోవెల్లంపల్లి శ్రీనివాస్ కూడా స్పందించారు. వీళ్లిద్దరూ కాకుండా రోజా కూడా తనదైన పంథాలో వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా పెద్ద దుమారమే రేపాయి. నష్టపోవడానికి పవన్ ఏమయినా నిర్మాతా, డిస్ట్రిబ్యూటరా అని వ్యాఖ్యానించారు. అవును! పవన్ నిర్మాత కాకపోయినా,డిస్ట్రి బ్యూటర్ కాకపోయినా తన సినిమా విషయంలో డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన వారయినా, డబ్బులు పెట్టి సినిమాతీసిన వారయినా ఎవ్వరైనా సరే నష్టపోతే ముందుగా స్పందించేది పవనే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రోజాకు కౌంటర్లు ఇస్తున్నారు జనసేన సభ్యులు.
ఇక నాగబాబు మళ్లీ స్పందించారు. తామేం మాట్లాడినా అంతెత్తు పౌరుషంతో తిరుగు సమాధానాలు ఇవ్వడం మానుకోవాలని హితవు చెప్పారు. మీరు అన్నింటికీ అతీతులా అని ప్రశ్నిస్తూ, మంత్రులు వాడే భాషను మేం వాడలేమా అంటూ కౌంటర్ ఇచ్చారు.ముఖ్యంగా నిన్నటివేళ కొడాలి నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అనరాని మాటలు అన్నారు. భీమ్లా నాయక్ అయినా బాహుబలి అయినా తమకు రెండూ సమానమేనని స్పీచ్ ఇచ్చారు. చంద్రబాబు ట్రాప్ లో పవన్ పడవద్దని హితవు చెప్పారు. వీటిపై కూడా నాగబాబు స్పందించారు. మీ పాలన ఎలా ఉందో అన్నది కనీసం మీకైనా తెలుస్తుందా అంటూ నిలదీస్తూ.. మీ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నారా ? అంటూ ఫైర్ అయ్యారు. గతంలో తాము తెలంగాణ సర్కారును ప్రశ్నించామని అయినా కూడా మా సినిమాకు ఇక్కడి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని అన్నారు. చిరంజీవికి,తమకూ మధ్య విభేదాలు సృష్టించేందుకు వ్యాఖ్యలు ఉంటున్నాయని కూడా మండిపడ్డారు.