ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటులో ఎటువంటి లోపాలకు తావివ్వకూడదని కూడా చెబుతున్నారు. సాధ్యమయినంత మేర ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.ఇదే సమయంలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటిదాకా ఉన్న అభ్యంతరాలను మరోసారి సమీక్షించి కొన్ని కీలక నిర్ణయాలు వెలువరించేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.ఈ దశలో పోలీసు అధికారులకు సంబంధించి ఉన్న సమస్యలు లేదా సందేహాలపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సరిపడినంత సిబ్బంది ఉన్నారని, కేంద్రం కూడా ఇటీవలే కొత్తగా ఐపీఎస్ లను కేటాయించిందని స్పష్టం చేశారు.విశాఖ కేంద్రంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ విభజనకు సంబంధించి తమ శాఖ పరంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవనే ధీమా వ్యక్తం చేశారు.ఇక సరిహద్దు జిల్లాలలో ఉన్న గంజాయి సాగు మరియు రవాణాపై ఇప్పటికే నిఘా ఉంచామని,ఒడిశా పోలీసులతో కలిసి తాము పనిచేస్తున్నామని అన్నారు. కరోనా కారణంగా పోలీసు శాఖలో నిలిచిన వీక్లీ ఆఫ్ లను త్వరలోనే పునరుద్ధరించి, సిబ్బందికి సంబంధిత సెలవులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నమని అన్నారు.