బడ్జెట్ అంటే ఏం లేదు అంకెల గారడీ.ఈ గారడీ వాడేంటి మాటల పేరడీ చేస్తాడేంటి అని అంటారో కవి..ఆ విధంగా రేపు కూడా అంకెల గారడీ..మాటల పేరడీ బుగ్గన ఖాతాలో హాయిగా వినవచ్చు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా అదే పనిగా వీటినే వినిపించనూవచ్చు.కానీ ఆర్థికంగా మనం ఎంత బలంగా ఉన్నాం అన్నది మాత్రం బుగ్గన చెప్పడు.పోనీ ఎంత బలహీనంగా ఉన్నామో కూడా చెప్పడు.ఇదే సమయంలో జగనన్న 3 రాజధానుల గురించి మాత్రం ఎప్పటిలానే కొంత చెబుతాడు.కొంత వదిలేస్తాడు.కేంద్రం మాత్రం అమరావతే రాజధాని అంటుంది.రాష్ట్రం మాత్రం కేటాయింపుల పేరిట అమరావతినే అడ్డు పెట్టుకుని నిధులు కూడా అడుగుతుంది.ఇదంతా అఫీషియల్ ప్రాసెస్. అన్ అఫీషియల్ గా తేలేదేంటంటే మేం 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం అనే మాట తప్ప మరొకటి వినిపించదు. మరోవిషయం మనకు స్ఫురణకు రాదు.
బడ్జెట్ సమావేశాల కారణంగా బుగ్గన కొన్ని విషయాలు చెబుతాడు.అవేటంటే సంక్షేమం పేరిట తాము ఎంత ఖర్చు పెట్టింది. ఎంత పెట్టాలి అని అనుకుంటున్నదీ మాత్రం చక్కగా వివరిస్తాడు.కానీ వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది మాత్రం వివరించడు.బుగ్గన పరిధిలో ఇంతకుమించి చేసేందుకు ఏమీ లేకున్నా వెనుకబడిన ప్రాంతాలకు (రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర) కనీస స్థాయిలో నిధులు వెచ్చించేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో అన్న సంశయం కూడా వెన్నాడుతోంది.ఇప్పటికే ఉత్తరాంధ్రలో అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయి. చిన్న చిన్న పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం ఆ పనులు చేపట్టిందన్న ఒకే ఒక కారణంతో కాంట్రాక్టర్లను వేధించిన దాఖాలాలు కుప్పలు ఉన్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల పనులు అయినా రోడ్ల నిర్మాణ పనులు అయినా ఈ ప్రభుత్వం వచ్చాక అస్సలు ముందుకు వెళ్లడం లేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. బడ్జెట్లో కేటాయింపులు ఉన్నా కూడా నిధులు మాత్రం సత్వరం విడుదల కావడం లేదు. కొన్ని పన్నుల పేరిట వసూళ్లు బాగున్నా కూడా నిధులు లేవు అని తప్పించుకుని తిరుగుతున్నారు అన్న అభియోగం ఏపీ సర్కారుపై ఉంది.ముఖ్యంగా పోలవరం పై మళ్లీ ఏం చెబుతారో అన్నది కూడా ఓ ఆసక్తిదాయకం.అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంపై ఏ పాటి ప్రేమ చూపిస్తారో అన్నది కూడా ఆసక్తిదాయకమే! ఈ దశలో బుగ్గన ఇచ్చే నిధులు,చేసే అప్పులు రానున్న కాలంలో ఏ మేరకు ప్రభావితం చేయనున్నాయో మరి!