బండి సంజయ్ ఏదో అనుకోకుండా ఎంపీ అయ్యారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంపీ అయ్యాక బండి సంజయ్ మూడేళ్లుగా నయాపైసా అభివృద్ది చేయలేదని మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. గతంలో మంత్రి గంగుల చేతిలో రెండు సార్లు పరాజయాలు చవిచూసిన విషయాన్ని బండి సంజయ్ మరిచిపోకూడదని సూచించారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కేటీఆర్ బండి సంజయ్ కు సవాల్ విసిరారు.
బండి సంజయ్ కరీంనగర్లో బీజేపీ తరపున పోటీ చేస్తే... లక్షకు పైగా మెజారిటీతో గంగులను గెలిపించుకుంటామని సవాల్ విసిరారు. ఆ గెలుపుతో నియోజకవర్గ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేలా చేస్తామన్నారు. జనం కూడా ఈ రికార్డు కోసం సహకరించాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా కరీంనగర్ సెంటిమెంట్ను కూడా మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ను లక్ష్మీనగరంగా సీఎం కేసీఆర్ చూస్తారనిన కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని కేసీఆర్ నమ్ముతారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కరీంనగర్ ప్రజలకు కష్టసుఖాల్లో తోడుండేది గులాబీ జెండా మాత్రమేనని మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఇటీవలే కరీంనగర్ కు మెడికల్ కాలేజీ మంజూరు చేశామని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇక ముందు తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్, ఫిలిప్పిన్స్ వంటి దేశాలకు వైద్య విద్య కోసం వెళ్లే అవసరం ఉండదన్నారు. తెలంగాణ వచ్చాక 150 లోపు ఉన్న గురుకుల పాఠశాలలను 900 గురుకుల పాఠశాలలకు పెంచామన్నారు.