హైదరాబాద్ లో ఐఏఎంసీ నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక వసతులు, స్థలం, నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని... ఐఏఎంసీ ఏర్పాటుతో ప్రముఖ సంస్థల్లోని వివాదాలు సత్వరమే రాజీ మార్గం ద్వారా పరిష్కరించడానికి అస్కారం ఏర్పడిందని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులను పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్న మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని, మౌలికవసతుల కల్పన, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యతనిస్తూ.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి వెల్లడించారు.
న్యాయ వ్యవస్థలో పనిభారం తగ్గించేందుకు కొత్తగా 47 కోర్టులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. వివిధ క్యాటగిరీల్లో 2542 పోస్టులను మంజూరు చేసిందని తెలిపారు. దీని వల్ల సత్వరం కేసులను పరిష్కరించడంతో పాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు.
కొత్త కోర్టుల ఏర్పాటుపై హైకోర్టు సిఫార్సులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక సహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.