ఏపీలో టెన్త్ పేపర్ల లీకేజి విషయంలో ఇప్పటికే 69 మందిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అందులో 36 మంది ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారని చెప్పారు బొత్స. ఇలా అక్రమాలకు పాల్పడుతూ దొరికిన ఉపాధ్యాయులంతా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియా ద్వారా బయటకు పంపారని వివరించారు బొత్స. అయితే ముందుగానే పేపర్ బయటకు రాలేదని అందుకే దాన్ని లీకేజీ అనలేమని చెప్పారు. తప్పులను తామెప్పుడూ ఉపేక్షించేది లేదన్నారు బొత్స. తమ ఆకాంక్ష విద్యార్థుల భవిష్యత్తు అని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు తమ రాతల ద్వారా ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాయని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. గతంలో డబ్బులు ఆశ చూపెట్టి ముందుగానే పేపర్లు బయటకు తెచ్చేవారని, అలాంటి వాటిని లీకేజీలంటారని, ఇప్పుడు అలాంటివి జరగట్లేదని చెప్పారు.
ఇక ఇంటర్ పరీక్షలకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు బొత్స. ఆరో తేదీ నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, పదిలక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. దీనికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే సీసీ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడతామన్నారు బొత్స. పరీక్షల తర్వాతే రాజకీయాలు మాట్లాడతామన్నారు బొత్స. పరీక్షల విషయంలో లోకేష్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు లోకేష్ కి పట్టదా అని అడిగారు బొత్స.