తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కి బొగ్గు కొరత లేదని.. ప్రధాని నరేంద్ర మోడీ అమావాస్య రోజు హెలికాప్టర్ వేసుకొని వస్తే దేశములో ఎక్కడ వెలుగులు కనిపిస్తే అదే తెలంగాణ రాష్ట్రం అని సెటైరిక్ గా చెప్పారు తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి.. బొగ్గు కొరత రాష్ట్రంలో లేదు కాని దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఎఫ్.ఆర్. బీ.ఎంకు లోబడి అప్పులు తీసుకోవాలని అనేక ఇబ్బందులు పెడుతుందని తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.
అభివృద్ధిలో ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని.. కానీ తెలంగాణ రాష్ట్రం ఎలా ముందుకు తీసుకొని పోవాలో సీఎం కేసీఆర్ తెలుసని తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. టీఎస్ ఎస్పీడిసిఎల్ లో తొలిసారిగా లైన్ ఉమెన్ గా ఉద్యోగం పొందిన శిరిషకు ఆయన నియామక పత్రం అందించారు. శిరీషకు నియామక పత్రాన్ని అందించి తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి అభినందించారు.
టీఎస్ ఎస్పీడిసిఎల్ లైన్ ఉమన్ శిరీష మాట్లాడుతూ.. ఒక మహిళగా టీఎస్ ఎస్పీడిసిఎల్ సంస్థలో లైన్ ఉమెన్ గా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. తాను కష్టపడి పని చేసి సంస్థకు పేరు తెస్తానని అంటున్నారు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించిన సంస్థకు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రికు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.