ఏపీలో గతంలో కూడా లేడీ గ్యాంగ్ లు హల్ చల్ చేసిన వార్తలొచ్చాయి. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే ఈ ముఠాలు హైవేలపై వాహనాలను ఆపి డబ్బులు డిమాండ్ చేసేవి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకోసం డబ్బులు సేకరిస్తున్నామని, ఇవ్వాల్సిందేనని అమ్మాయిలు పట్టుబట్టేవారు. అమ్మాయులు అనే మొహమాటంతో చాలామంది డబ్బులు ఇచ్చేవారు. అయితే ఇది నిజంగా సమాజ సేవ కాదు, కొంతమంది పక్క రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు ముఠాలుగా ఏర్పడి చేసే దందా. ఇప్పుడీ దందా మరో మలుపు తిరిగింది.

ఆర్టీసీ బస్సుల్లో ఎవరో ఒకరు సడన్ గా బస్సు ఎక్కి, అందరికీ పేపర్లు పంచి పెడుతుంటారు. వారు దిగేసే సమయానికి తమ కష్టాలు చెప్పుకుని అందర్నీ డబ్బులు అడుగుతారు. ఫలానా రాష్ట్రంలో వరదలు వచ్చాయని, తామంతా వలస వచ్చామని, అమ్మాయి పెళ్లికి డబ్బులు కావాలని అడుగుతారు. దయగలవారు ఎవరైనా ఇస్తే తీసుకెళ్లేవారు. కానీ ఇక్కడ అది కాదు, డిమాండ్ ఎక్కువైంది. గుంటూరు జిల్లాలో గుజరాత్ కి చెందిన మహిళల ముఠా ఇలా డిమాండ్ చేసి మరీ వాహనదారుల దగ్గర డబ్బులు తీసుకునేవారు. ఈ ముఠాలో మొత్తం 32 మంది మహిళలు ఉన్నట్లు గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు.

గుంటూరు నుంచి తెనాలి వెళ్లే రూట్ లో పెదకాకాని హైవే దగ్గర వాహనదారులను ఇలా అమ్మాయిలు ఆపిమరీ డబ్బులు అడగడం చాలామంది గమనించారు. కొంతమందిని వారు బెదిరించేవారు కూడా. డబ్బులు ఇవ్వకపోతే.. తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేస్తామంటూ యువకులను వారు బెదిరించేవారని తెలుస్తోంది. దీనిపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు అందింది పోలీసులు నిఘా పెట్టి.. మొద్దం 18మందిని అరెస్ట్ చేశారు. వారంతా గుజరాత్ కి చెందినవారుగా తేలింది. మిగతావారికోసం పోలీసులు గాలిస్తున్నారు. గుజరాత్‌ లోని దుర్గానగర్‌ కి చెందిన యువతులు గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డుతోపాటు, మరికొన్ని ప్రాంతాల్లో ఇలా చందాలకోసం తిరుగుతున్నారని పోలీసులుకు సమాచారం అందింది. సామాజిక సేవా కార్యక్రమాలు, లేదా తాము కష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటూ చాలామంది డబ్బులు అడుగుతుంటారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయిలు డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు, బ్లాక్ మెయిల్ కి కూడా దిగడంతో పోలీసులు నేరుగా వారిని అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: