ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్రలో పాల్గొంటారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన గోపాలకృష్ణ.. వీరంతా బస్సు యాత్ర పోస్టర్ ని ఆవిష్కరించారు. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్ర చేపట్టబోతున్నారు వైసీపీ మంత్రులు. యాత్రతోపాటు.. ప్రతి రోజు ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ యాత్ర శ్రీకాకుళం నుంచి మొదలవుతుంది. 29వ తేదీన అనంతపురంలో బహిరంగ సభతో ముగుస్తుంది.
వైసీపీ బస్సు యాత్రలో 17 మంది మంత్రులు పాల్గొంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు కూడా వారితోపాటు బహిరంగ సభల్లో పాల్గొంటారు. గతంలో బలహీన వర్గాలకు మంత్రి పదవి ఇస్తే చాలు అనుకునే రోజులు ఉండేవని, కానీ జగన్ హయంలో.. బలహీన వర్గాలకే అన్ని పదవులు ఇస్తున్నారని చెప్పారు నేతలు. వైసీపీ కేబినెట్లో 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు ఉన్నారని, జగన్ చెబుతున్న సామాజిక న్యాయం ఇదేనని అన్నారు మంత్రులు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఇలా పదవులిచ్చే ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశామా అంటున్నారు మంత్రులు. జగన్ సామాజిక న్యాయం గురించి మరింత విస్తృతంగా చర్చ జరిగేందుకే తాము బస్సు యాత్ర మొదలు పెట్టినట్టు చెబుతున్నారు.