భారత్లో బీఏ.4, బీఏ.5 సబ్వేరియెంట్ కేసులు నమోదు అయినట్లు ఇన్సాకాగ్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఇకపై మరింత అలెర్ట్ గా ఉండాలని సూచించింది. బీఏ.4 కేసులు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో నమోదు కాగా తాజాగా బీఏ.5 కేసు కూడా తెలంగాణ రాష్ట్రం లోనే నమోదు అయ్యిందని పేర్కొన్నారు. దాంతో తెలంగాణా రాష్ట్ర ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆంధ్రలోను కలవరం మొదలయ్యింది. ఒమిక్రాన్ వేరియెంట్లో ఉపవేరియెంట్లు బీఏ.4, బీఏ.5లు..అత్యంత వేగవంగా వైరస్ను వ్యాప్తి చెందించేవిగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇపుడు అదే విషయం అందర్నీ భయపెడుతోంది. దక్షిణాఫ్రికా నుంచి దీని విజృంభణ మొదలైందని సంగతి అందరికి తెలిసిందే.
కాగా ఇపుడు భారత్ లోనూ దీని పంజా పడింది. అయితే ఇక్కడ వైద్యులు చెబుతున్న ముఖ్య అంశం ఏమిటంటే..ఈ వేరియంట్లు గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఎందుకంటే.. ఒమిక్రాన్ ప్రధాన వేరియంట్ కంటే ఇవి పెద్దగా ప్రమాదకారి కావని, అయితే సామాజిక వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని చెబుతున్నారు, అయితే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. ఇదే అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కాకపోతే వైరస్ లు అనేవి ఎపుడు ఎలాంటి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి అన్నది ఎవరు ఊహించలేం కాబట్టి నియమాల్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ముందస్తు జాగ్రత్త తప్పనిసరి అని పదేపదే చెబుతున్నారు. అలాగే అప్రమత్తమైన అధికారులు.. కాంటాక్ట్ ట్రేసింగ్ పనిలో పడ్డారు.