పేమెంట్స్కు సంబంధించిన డేటాను భద్రపరచడంలో విఫలమైన కారణంగా గతేడాది జులై 14 న విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటన లో పేర్కొంది. ''డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డ్ పై గతేడాది విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నాం. మాస్టర్ కార్డ్ వివరణ సంతృప్తికరంగా అనిపించడం తో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక పై తన డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్వర్క్ లోకి కొత్త వినియోగదారులను చేర్చుకోవచ్చు'' అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
పేమెంట్స్కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చింది. గడువు పూర్తైనా నిబంధనలు పాటించడంలో మాస్టర్ కార్డ్ విఫలమయ్యింది. దీంతో పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 (పీఎస్ఎస్ చట్టం) ప్రకారం ఆర్బీఐ చర్యలు తీసుకుంది..ఈ నిర్ణయం తో కొత్త కార్డులను జారీ చెయ్యడం అనేది నిలిపి వేసింది.తాజాగా ఈ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో వినియోగదారుల కోసం మాస్టర్ కార్డ్ త్వరలో కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది.