చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా కనబడుతోంది. రాబోయే మార్చిలో జరగబోయే ఎన్నికలకు ఇప్పటినుండే రెడీ అవుతున్నట్లున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ కాలముంది కదాని అనుకుంటున్నారా ? సాధారణ ఎన్నికలకైతే షెడ్యూల్ ప్రకారం రెండేళ్ళున్నది కరెక్టే. కానీ వచ్చే మార్చిలో జరగబోయేది ఎంఎల్సీ ఎన్నికలు. శాసనమండలిలో పట్టభద్రుల కోటాలో మూడుస్ధానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ మూడు స్ధానాల కోసం అభ్యర్ధుల ఎంపికకు జగన్ రెడీ అవుతున్నారట.
మూడు స్ధానాలు ఏమిటంటే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాలు ఒకటి. రెండో స్ధానం ఏమిటంటే కడప-కర్నూలు-అనంతపురం జిల్లాలు. ఇక మూడోదేమిటంటే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు. పై తొమ్మిది జిల్లాల్లోని పట్టభద్రులు ముగ్గురు అభ్యర్ధులను ఎన్నుకోవాల్సుంటుంది. ప్రతి జిల్లాలోను లక్షలసంఖ్యలో ఓటర్లుంటారు. నిజానికి ఈ ఎన్నికలను మూడ్ ఆఫ్ ది పీపుల్ అనేందుకు లేదు. కాకపోతే అర్బన్ ప్రాంతంలోని ఓటర్ల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేందుకు ఒక సంకేతంగా ఉపయోగపడతాయంతే. దీన్నే సాధారణ ఎన్నికలకు రిహార్సిల్ గా జగన్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.
పార్టీ తరపున ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు అభ్యర్ధిగా శ్యామ్ ప్రసాదరెడ్డి, అనంతపురం-కడప-కర్నూలు జిల్లాల నుండి వెన్నపూస రవీంద్రరెడ్డి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ ను పోటీ చేయించాలని డిసైడ్ చేశారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లోని పట్టభద్రులు ఎన్నికల్లో ఓట్లేయబోతున్నారు. అంటే అర్బన్+విద్యావంతులైన ఓటర్ల ఆలోచనలు చూచాయగా తెలిసే అవకాశముంది. కాబట్టే జగన్ ఈ ఎన్నికను ప్రతిష్టగా తీసుకున్నారు. మరి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఏమి చేస్తారో చూడాలి. జగన్ ప్రభుత్వంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెబుతున్న చంద్రబాబు, పవన్ ఎంఎల్సీ ఎన్నికల్లో అభ్యర్ధులను దింపి గెలిపించుకుంటే వాళ్ళు చెప్పింది నిజమేనేమో అని ఆలోచించే అవకాశముంటుంది. ఒకవేళ మూడు స్ధానాలను వైసీపీనే తన ఖాతాలో వేసుకుంటే మాత్రం చంద్రబాబు, పవన్ ఆరోపణలు, మాటలకు పెద్దగా విలువుండదనే చెప్పాలి. చివరకు ఏమవుతుందో చూడాలి.