ప్రస్తుతం తెలంగాణలో 40,593 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 923 మందికి కరోనా వ్యాధి నిర్థారణ అయింది. గడిచిన 24 గంటల్లో 739 మంది కరోనా బారినుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. అంటే రికవరీ కేసులకంటే, పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్లే ఇప్పుడు కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో మరోసారి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈటీవల కురుస్తున్న భారీ వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంబిస్తాయన్న అనుమానం కూడా ఉంది. దీంతోపాటు.. ఇప్పుడు కొవిడ్ కేసులు కూడా పెరగడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 8,18,290 మందికి కరోనా సోకినట్టు అధికారులు ప్రకటించారు. వారిలో 8,09,009 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వల్ల 4111 మంది మరణించారు. ప్రస్తుతం కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 366 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 79 కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 59 కేసులు బయటపడ్డాయి. నల్గొండలో 51 మందికి కరోనా సోకగా, పెద్దపల్లిలో 34 మంది, మంచిర్యాలలో 30మంది, నిజామాబాద్లో 28మంది, యాదాద్రి భువనగిరిలో 24మంది, హనుమకొండలో 22మంది, కరీంనగర్ లో 20మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉంటే చాలని చెబుతున్నారు అధికారులు. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.