రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులను ఫైనల్ చేసేపనిని జగన్మోహన్ రెడ్డి అప్పుడే మొదలుపెట్టేసినట్లే ఉన్నారు. ఎందుకంటే రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఈ రెండుచోట్లా జగన్ అభ్యర్ధులను ప్రకటించేశారు. కుప్పం కార్యకర్తల సమావేశంలో ఎంఎల్సీ భరత్ ను క్యాండిడేట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలోనే సిట్టింగ్ ఎంఎల్ఏ కంబాల జోగులునే అభ్యర్ధిగా ప్రకటించేశారు.





అంటే నియోజకవర్గాల కార్యకర్తల సమావేశానికి ముందే జగన్ ఆ నియోజకవర్గంలో అభ్యర్ధి విషయంలో క్లారిటితో ఉన్నట్లు అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో అందరు పాల్గొనాల్సిందే అని కచ్చితంగా చెప్పారు. జనాల నుండి వస్తున్న వ్యతిరేకతను జగన్ పట్టించుకోవటంలేదు. మంత్రులు, ఎంఎల్ఏలు జనాల దగ్గరకు వెళ్ళినపుడు ప్రజలనుండి వ్యతిరేకత వస్తుందని జగన్ కు బాగా తెలుసు. ఈ విషయాన్ని కార్యక్రమం మొదలైనపుడే చెప్పారు.





తాను చెప్పినా, హెచ్చరించినా కూడా జనాల్లోకి వెళ్ళని ఎంఎల్ఏల జాబితాను తెప్పించుకుంటున్నారు. కాబట్టి కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇక్కడ జగన్ లెక్కేమిటంటే తాను చెప్పింది చెప్పినట్లు మంత్రులు, ఎంఎల్ఏలు ఆచరించాల్సిందే తప్ప వేరేదారిలేదు. అలా ఆచరించని, తన ఆదేశాలను థిక్కరిస్తున్న వారి జాబితానే తయారుచేస్తున్నారు.  కాబట్టి వచ్చే ఎన్నికల్లో జాబితాలోని వారికి టికెట్లు అనుమానమే.






మంత్రులు, ఎంఎల్ఏలు జనాల్లోకి వెళ్ళినపుడు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా కావాలనే గోలచేయిస్తాయని జగన్ కు తెలుసు. అయినా ఆదేశించారంటే మంత్రులు, ఎంఎల్ఏలను జనాల్లో ఉంటున్నారా లేదా అన్నది ముఖ్యం.  మొత్తానికి కార్యకర్తల సమావేశాలనే అభ్యర్ధుల ప్రకటనకు జగన్ వేదికగా మార్చుకుంటున్నారా అనే  సందేహాలు పెరిగిపోతున్నాయి. చూస్తుంటే ఈ ఏడాదిలోగానే దాదాపు అన్నీ నియోజకవర్గాలకు జగన్ అభ్యర్ధులను ప్రకటించినా ఆశ్చర్యంలేదు. ముందే అభ్యర్ధులను ఫైనల్ చేసేస్తే ప్రచారానికి, వ్యతిరేకత తగ్గించుకోవటానికి కావాల్సినంత సమయం ఉంటుందన్నదే బాటమ్ లైన్.

మరింత సమాచారం తెలుసుకోండి: