మునుగోడు ఉపఎన్నికకు సంబందించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టమైన స్నిగల్ ఇచ్చినట్లేనా ? మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తుంటే తన మనసులోని మాటను స్పష్టగా బయటపెట్టినట్లేనా ? అవుననే అనిపిస్తోంది. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధికి సహకరించేది లేదని చెప్పకనే చెప్పేశారు. తాను ప్రచారానికి వెళ్ళను, బహిరంగసభల్లో పాల్గొనేది లేదని చెప్పేశారు. కాకపోతే ఒకచిన్న షరతుపెట్టారు.





తన షరతులను అంగీకరిస్తే అప్పుడు ఉపఎన్నిక ప్రచారం గురించి ఆలోచిస్తానని స్పష్టంగా చెప్పేశారు. చండూరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతు ఒక సీనియర్ నేత వెంకటరెడ్డిని బూతులుతిట్టారు. పైగా ఆ సభలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దాంతో ఎంపీకి ఇంకా మండింది. తనను బూతులుతిట్టిన నేతను సస్పెండ్ చేయాలని, పేరుచెప్పకుండానే రేవంత్ క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. తన డిమాండ్లు ఫుల్ ఫిల్ అయినతర్వాతనే ఉపఎన్నిక గురించి ఆలోచిస్తానని తేల్చిచెప్పారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే రేవంత్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటినుండి పడటంలేదు. అలాగే నిత్యం అసమ్మతి రాజకీయాలుచేసే బ్రడర్సంటే చాలామందికి పడదు. ఇందులో భాగంగానే చండూరు బహిరంగసభలో ఒకనేత బూతులుతిట్టారు. అయితే వెంకటరెడ్డి మాత్రం దాన్ని రేవంత్ కు ముడిపెడుతున్నారు. తిట్టిన నేత మరుసటిరోజే వెంకటరెడ్డికి మీడియాలోనే క్షమాపణలు చెప్పేశారు. అయితే ఎంపీ మాత్రం దానికి అంగీకరించటంలేదు. సదరునేతతో తనను తిట్టించిన పెద్దనేతే తనకు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.






ఎంపీ డిమాండ్ కు రేవంత్ అంగీకరిస్తారా లేదా అన్నది సస్పెన్సుగా మారింది. పైగా ఉపఎన్నిక గురించి ఇప్పటివరకు తనతో ఎవరూ మాట్లాడలేదని కూడా అన్నారు. ఏఐసీసీ నేతలు వెంకటరెడ్డితో ఉపఎన్నిక గురించి మాట్లాడినట్లు మీడియాలోనే వచ్చింది. అయినా ఎంపీ మాత్రం ఎవరు మాట్లాడలేదనే చెబుతున్నారు. సో జరుగుతున్నది చూస్తుంటే ఉపఎన్నికలో ఎంపీ కాంగ్రెస్ విజయానికి పనిచేసది అనుమానంగానే ఉంది. ఒకవేళ ప్రచారంచేసినా గెలుపుకు కృషిచేయటం మాత్రం డౌటే. పార్టీకి పనిచేయటం ఇష్టంలేకే గొంతెమ్మకోరికలు కోరుతున్నారని తెలిసిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: