తిమ్మిని బమ్మిని చేస్తారో లేకపోతే బిమ్మినే తిమ్మిని చేస్తారో తెలీదుకానీ మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచితీరాల్సిందే. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు పార్టీ గెలుపు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓటమి మాత్రం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటమనే చెప్పాలి. ఎందుకంటే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారో తెలీదుకానీ ఓడిపోవాలని కోరుకునే వాళ్ళకు కొదవేమీలేదు.






కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటున్నవాళ్ళల్లో అత్యధికులకు రేవంతే టార్గెట్. రేవంత్ ను దెబ్బకొట్టేందుకు అవసరమైతే పార్టీకి వ్యతిరేకంగా పోటీచేయటానికి కూడా కాంగ్రెస్ నేతల్లో చాలామంది రెడీగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతిపెద్ద సమస్యే ఇది. టికెట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే పార్టీ ఎవరినో ఒకరిని మాత్రమే పోటీలో దింపగలుగుతుంది. దాంతో మిగిలిన వాళ్ళల్లో కొందరు సైలెంటుగా ఉండిపోతారు. మరికొందరు అభ్యర్ధి ఓటమికి వెనుకనుండి గోతులు తవ్వుతారు.






కాంగ్రెస్ కల్చర్ బాగా తెలిసిన తర్వాత కూడా రేవంత్ పార్టీలో చేరారు. చాలా తొందరగానే ప్రెసిడెంట్ అయిపోయారు. అక్కడినుండే అసలు సమస్య మొదలైంది. మొన్నటి హుజూరాబాద్ ఉపఎన్నికలోనే రేవంత్ కు పెద్ద దెబ్బ పడాల్సింది. అయితే తెరవెనుక జరిగిన అనేక పరిణామాల కారణంగా కాంగ్రెస్ ఓటమి బాధ్యతనుండి రేవంత్ తప్పించుకున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నిక నుండి అలా తప్పించుకోలేరు. కాంగ్రెస్ పార్టీకి ఇపుడు గెలిచితీరాల్సిన అగత్యం ఏర్పడింది. ఎందుకంటే మొన్నటివరకు ఇది కాంగ్రెస్ సీటు కాబట్టే.






కాంగ్రెస్ ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేయటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. జరగబోయే ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే రేవంత్ సత్తాఏమిటో చెప్పినట్లవుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం రేవంత్ కు వ్యతిరేకంగా చాలామంది సీనియర్లు మరింతగా రెచ్చిపోతారు. పీసీసీ అధ్యక్షపదవి నుండి దింపేసేంతవరకు ఊరుకోరు. సో పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంతవసరమో రేవంత్ కు అంతకుమించే అవసరం. ఈ విషయం రేవంత్ కు తెలీకుండా ఏముండదు. కాబట్టి గెలుపుకోసం ఎలాంటి వ్యూహాలు పన్నుతారో ? చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: