పార్టీల అధినేతలు ఇద్దరికీ వచ్చే ఎన్నికలకు సంబంధించి తలనొప్పులు తప్పేట్లు లేదు. ఇంతకీ తలనొప్పులు ఎక్కడినుండి వస్తున్నాయంటే సొంతపార్టీల నుండి అదికూడా తమ ఎంపీలనుండే కావటం గమనార్హం. ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ, టీడీపీలకు చెందిన ఎంపీల్లో కొందరు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా కాకుండా ఎంఎల్ఏలుగా పోటీచేయాలని అనుకుంటున్నారు. తాము అనుకోవటమే కాకుండా నియోజకవర్గాలను కూడా వెతికిపెట్టుకున్నారు. ఇది ఇపుడు ఇటు జగన్మోహన్ రెడ్డికి అటు చంద్రబాబునాయుడుకు తలనొప్పులుగా తయారయ్యాయి.





వైసీపీ సంగతే తీసుకుంటే కాకినాడ ఎంపీ వంగా గీత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా పోటీచేయటానికి రెడీ అయిపోయారు. తాము ఎట్టి పరిస్ధితుల్లోను ఎంపీలుగా పోటీచేయమని నేరుగా జగన్ తోనే చెప్పారట. అయితే జగన్ స్పందన ఏమిటన్నది మాత్రం తెలీటంలేదు. అలాగే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు ఎంఎల్ఏగా పోటీచేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే.





ఇక టీడీపీ విషయంచూస్తే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా నరసన్నపేట ఎంఎల్ఏగా పోటీచేస్తానని చంద్రబాబుతో చెప్పేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా చంద్రగిరి ఎంఎల్ఏగా పోటీచేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంపీగా జయదేవ్ అంత యాక్టివ్ గా లేరు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని పోటీ అయోమయంలో ఉన్న విషయం అందరు చూస్తున్నదే. కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా విజయనగరం ఎంఎల్ఏగా పోటీచేయటానికి రెడీ అవుతున్నారట.






వైసీపీలో ఇప్పటికి బయటపడింది ముగ్గురు ఎంపీలే అయినా ఇంకా కొందరు కూడా అసెంబ్లీ పోటీకే మొగ్గు చూపుతున్నారట. దాంతో తమకు అసెంబ్లీకి పోటీచేసే అవకాశం కల్పించాలని జగన్ను పదే పదే కోరుతున్నారు. ఎవరెంత కోరినా చివరకు జగన్ నిర్ణయమే ఫైనల్ అన్న విషయం తెలిసిందే. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: