ఇపుడు కాపు సామాజికవర్గమంతా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తోంది. కారణం ఏమిటంటే అగ్రవర్ణాల్లోని పేదలకు నరేంద్రమోడి ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ కు సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే. సుప్రింకోర్టు ఆమోదం ఏపీలో పెనుమార్పులకు సంకేతాలుగా నిలవబోతున్నాయి. ఎలాగంటే అగ్రవర్ణాల పేదలనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కాపులే. కారణం ఏమిటంటే తమకు రిజర్వేషన్ వర్తింపచేయాలని కాపులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.





ఇందులో భాగంగానే 2014 ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నిజానికి చంద్రబాబు ఇచ్చింది తప్పుడుహామీ. రిజర్వేషన్లన్నది రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిది కాదు. ఆ విషయం తెలిసినా చంద్రబాబు హామీఇచ్చారు కాబట్టే తప్పుడు హామీ అన్నది. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న చంద్రబాబు 5 శాతం కాపులకు కేటాయించారు. దీని అమలుకు జీవో ఇచ్చినా ఎన్నికల హడావుడిలో ఎవరు పట్టించుకోలేదు.





ఇపుడు ఆ 10 శాతం రిజర్వేషన్ను సుప్రింకోర్టు ఆమోదించింది కాబట్టి అందులో తమకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కాపులు కోరుతున్నారు. అంటే కాపులకు రిజర్వేషన్ వర్తింపచేసే బాల్ ఇపుడు జగన్ చేతిలో ఉంది. మరి జగన్ ఏమి నిర్ణయం తీసుకుంటారు ? ఇక్కడే కాపుమంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఉద్యమనేతలు యాక్టివ్ అవుతున్నట్లు సమాచారం. వచ్చేఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరేందుకు వీళ్ళంతా రెడీ అవుతున్నారట. రిజర్వేషన్ అమలుచేయాలని కాపుసంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి.





జగన్ గనుక కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలుచేస్తే జనసేన, టీడీపీ మీద దెబ్బపడుతుందని వైసీపీలోని కాపు ప్రముఖులు అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్ గనుక పక్కాగా జగన్ అమల్లోకి తెస్తే కాపుల్లో కూడా మెజారిటి ఓట్లు వైసీపీకే పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ మొదలైంది. అయితే ఇక్కడ అనుమానం ఏమిటంటే బీసీల్లాగ కాపులు ఎప్పుడూ ఒకపార్టీకి కట్టుబడిలేరు. కాబట్టి రిజర్వేషన్ అమలుచేసినా కాపుల ఓట్లు గంపగుత్తగా పడతాయనే గ్యారెంటీ కూడా ఎవరు ఇవ్వలేరు. మరి జగన్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: