రాష్ట్రానికి సంబందించిన పెద్దపారిశ్రామికవేత్త తెలంగాణాలో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఏపీలో ఎంపీగా ఉంటూ ఇప్పటికే మూడు యూనిట్లను నిర్వహిస్తున్న ఈ పారిశ్రామికవేత్త కమ్ ఎంపీ తెలంగాణాలో పెట్టుబడి పెట్టడానికి కారణం ఏమిటి ? ఏమిటంటే జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్న వైరమేనని అర్ధమవుతోంది. అమరరాజా బ్యాటరీస్ అంటే దేశవ్యాప్తంగా పేరున్న పారిశ్రామిక సంస్ధ. దీనికి యజమాని టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.




 


ఇలాంటి పారిశ్రామికవేత్త కమ్ ఎంపీ పరిశ్రమ విస్తరణకు తెలంగాణాను ఎంచుకున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో ఉపయోగించే అయాన్ లిథియమ్ బ్యాటరీల ఉత్పత్తి ప్లాంటును రు. 9500 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయ్యుండి, ఇప్పటికే చిత్తూరు, కరకంబాడి, చంద్రగిరిలో మూడు యూనిట్లను నిర్వహిస్తున్న వ్యక్తి విస్తరణకు తెలంగాణాకు ఎందుకు ఎంచుకున్నట్లు ? ఎందుకంటే ప్రభుత్వంతో పడకపోవటమే. సంస్ధ ఎక్కడ ఏర్పాటుచేయాలనేది పూర్తిగా యాజమాన్యం ఇష్టమే అనటంలో సందేహంలేదు. అయితే జగన్ కాస్త చొరవ చూపుంటే ఆ యూనిటేదో ఏపీలోనే ఫెట్టుండేవారేమో.





రాష్ట్రానికి  పెట్టుబడులు రావాలని, పరిశ్రమలు ఏర్పాటు కావాలని, ఉద్యోగ, ఉపాధి కల్పించాలని జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఇదేసమయంలో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలే ఇతర రాష్ట్రాలకు వెళిపోవటం ఏమిటి ? ఇది కచ్చితంగా ప్రభుత్వానికి మైనస్ అనేచెప్పాలి. గల్లా జయదేవ్ టీడీపీకి చెందిన ఎంపీ అయినా అంతకుముందే పారిశ్రామికవేత్త. ప్రభుత్వాలు మారినా పాలసీలు పారిశ్రామికవేత్తలను ఆకర్షించేట్లుగా ఉండాలి. అంతేకానీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుండి వెళ్ళిపోయేట్లు చేయటం చాలా తప్పు.





సుమారు 5 వేలమందికి ఉద్యోగ, ఉపాధికల్పించగలిగిన ఫ్యాక్టరీని ఏపీలో కాకుండా తెలంగాణాలో ఏర్పాటుచేయాలని అనుకోవటం వెనుక రాజకీయాలే ఉన్నట్లు అనిపిస్తోంది. వివిధ సందర్భాల్లో గల్లా ఫ్యామిలి జగన్ను కలవాలని ఎన్నిసార్లు  ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. ఫ్యాక్టరీ నిర్వహణలో నిబంధనలు పాటించటంలేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే నోటీసులని, తనిఖీలని రకరకాల కారణాలతో దాడులు చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకునే యాజమాన్యం కొత్త యూనిట్ ఏర్పాటుకు తెలంగాణాను డిసైడ్ చేసుకున్నట్లు అనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: