ఇపుడిదే హాట్ టాపిక్ అయిపోయింది. తెలుగుదేశంపార్టీకి చెందిన ముగ్గురు లోక్ సభ సభ్యులతో పాటు వైసీపీకి చెందిన ఒక ఎంపీ రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించటమే హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే జీ20 దేశాల సన్నాహక సమావేశంలో సూచనలు ఇవ్వటానికి చంద్రబాబునాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశానికి ముందే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీ అధినేతతో భేటీఅయ్యారు.





తర్వాత రఘురాజు మీడియాతో మాట్లాడుతు ప్రత్యేకహోదా సాధనకోసం తాను రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇదే విషయమై టీడీపీ ముగ్గురు ఎంపీలతో మాట్లాడి రాజీనామాలు చేసేట్లుగా ఒప్పించేందుకే ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. సరే ఇక్కడితో రఘురామ పాత్ర అయిపోయింది. అయితే  ఆతర్వాత టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతు సమస్యల పరిష్కారం కోసం రాజీనామాలకు సిద్ధమన్నారు.





రాజీనామాలు చేయటానికి సిద్ధమని ముందు రఘురాజు చెప్పటం, తర్వాత ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీలు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలు ఎలాగూ దగ్గరపడుతున్నాయి కాబట్టి రాజీనామాల డ్రామాతో సెంటిమెంట్ ప్లే చేసి ప్రజలను ఆకట్టుకోవాలని ఆలోచిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకహోదా కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసీపీ లోక్ సభ ఎంపీలతో రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే. అప్పట్లో టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు ముందు చంద్రబాబు ఒప్పుకుని తర్వాత యూటర్న్ తీసుకున్నారు.






దాంతో తన ఎంపీలతో జగన్ రాజీనామాలు చేయించి ఏపీభవన్లో నిరాహారదీక్ష చేయించటం అందరికీ తెలిసిందే. దాదాపు అలాంటి సీనే ఇపుడు టీడీపీ ఎంపీలు కూడా రిపీట్ చేయబోతున్నారా అని అనుమానంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే అప్పట్లో ప్రత్యేకహోదా కోసం జనాల్లో ఉన్న సెంటిమెంట్ ఇఫుడు లేదు. హోదా డిమాండ్ అనేది రాజకీయ నినాదంగా మారిపోయింది. కొద్దిరోజుల్లోనే వీళ్ళ రాజీనామాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: