చివరకు మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య కూడా జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ వెంటనే  అమలుచేయకపోతే  నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటు జగన్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తు గతంలోనే నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. (ఈడబ్ల్యూఎస్) కాపులను బీసీల్లో చేరుస్తాననే తప్పుడు హామీ ఇచ్చి ఫెయిలైన జగన్ వెంటనే కేంద్రం నిర్ణయాన్ని తనకు అనుకూలంగా తీసుకోవాలని అనుకున్నారు.




కాపులను బీసీల్లో చేర్చటంలో ఫెయిలైన చంద్రబాబు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో 5 శాతం కాపులకు కేటాయించారు. అయితే అదే సమయానికి ఎన్నికలు జరగటం, టీడీపీ  ఘోరంగా ఓడిపోయి వైసీపీ అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్నే ఇపుడు జగన్ అమలు చేయాలని  జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. నిజానికి కేంద్రం ఇచ్చిన 10 శాతంలో కాపులకు చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్ ఏకపక్షంగా కేటాయించటమే తప్పు.




అగ్రవర్ణాల జనాభా నిష్పత్తి ప్రకారమే 10 శాతం రిజర్వేషన్ పంచాలన్నది జగన్ ఆలోచన. అయితే జగన్ ఆలోచనతో సంబంధంలేకుండానే తమకు 5 శాతం కేటాయించాలంటు జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 31వ తేదీలోగా తమ డిమాండ్ ను అమలుచేయకపోతే 31వ తేదీ తర్వాత నిరవదిక నిరాహార  దీక్షలోకి దిగుతానని బెదిరిస్తున్నారు. 





నిజానికి జోగయ్య బెదిరింపులను జగన్ లెక్కకూడా చేయరు. 87 ఏళ్ళ వయసులో ఉన్న జోగయ్య నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని బెదిరించటమే పెద్ద జోక్. తనంతట తానుగా పట్టుమని పదడుగులు కూడా సరిగా వేయలేని జోగయ్య కూడా చివరకు జగన్ను బెదిరిస్తున్నారు. కాపు సంక్షేమ సమితి అని ఒకదాన్ని పెట్టుకుని ఇంతకాలం ప్రెస్ నోట్లకు మాత్రమే పరిమితమైన ఈ మాజీమంత్రి ఇపుడు ఏకంగా జగన్ కు వార్నింగులిచ్చేశారు. మరి జోగయ్య వార్నింగ్ పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: