కాపు రిజర్వేషన్ల విషయమై పిటీషన్ అడ్మిట్ చేసుకునే  దశలోనే తన వైఖరి ఏమిటో హైకోర్టు చెప్పేసింది. దీనికి అందరు మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్యకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజకీయపార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము ఆదేశించలేమని కోర్టు తేల్చి చెప్పేసింది.  కోర్టు వ్యాఖ్యల కారణంగా కాపు రిజర్వేషన్ల అంశం అయోమయంలో పడిపోయింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలుచేస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయించాలని జోగయ్య కోర్టులో పిటీషన్ వేశారు. ఇక్కడ పిటీషన్ వేసింది జోగయ్యే అయినా వేయించింది పవనే అనే ప్రచారం పెరిగిపోతోంది.




కోర్టు వ్యాఖ్యతో రిజర్వేషన్ అమలుపై కాపుల్లో ఈ పాటికే ఒక క్లారిటి వచ్చేసుంటుంది. అసలు విషయం ఏమిటంటే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇవ్వలేదు. కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చింది, ఫెయిలైంది చంద్రబాబునాయుడు.  అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు 2018లో కేంద్రం నిర్ణయించింది. అందులో 5 శాతాన్ని కాపులకు కేటాయిస్తు జీవో ఇచ్చింది కూడా చంద్రబాబే. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ జీవోను పట్టించుకోలేదు. అయితే అప్పట్లో చంద్రబాబు హామీని అమలు చేయమని పవన్ కూడా ఎప్పుడూ అడగలేదు.




సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే తొందరలోనే ఎన్నికలు రాబోతోంది కాబట్టి కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో జగన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సామాజికవర్గంలోని ప్రముఖులు కాపుమంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలతో భేటీలు జరుపుతున్నారు. వీళ్ళందరితో మాట్లాడి రిజర్వేషన్ అంశంపై జగన్ తో ప్రకటనచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కేటాయించటమే చంద్రబాబు చేసిన తప్పు. అగ్రవర్ణాల్లోని పేదల దామాషా ప్రకారమే రిజర్వేషన్లు కేటాయించాలి.




అయితే అగ్రవర్ణాల్లో కాపులు తప్ప ఇంకెవరు రిజర్వేషన్లు కోరటంలేదు. కాబట్టి కాపులకు 5 శాతం రిజర్వేషన్ అన్నది రాజకీయంగా సాధించుకోవాలే కానీ కోర్టుల ద్వారా సాధ్యంకాదు. ఈ ప్రయత్నం ఒకవైపు జరుగుతుండగానే జోగయ్య కోర్టులో పిటీషన్ వేశారు. దాంతో ఇపుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జగన్ అనుకున్నా కోర్టులో కేసు అడ్డంకిగా మారింది. దీనివల్ల జోగయ్యకు వచ్చే నష్టమేమీలేదు. ఏదన్నా నష్టం జరిగితే అది పవన్ కు మాత్రమే.  



మరింత సమాచారం తెలుసుకోండి: