జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ వేసిన కాసేపటికే, తాను సీఎం కాబోతున్నానని..సమస్యలు పరిష్కరిస్తానని పవన్ వెల్లడంచారు. విశాఖపట్నం జిల్లా గాజువాక శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పవన్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గాజువాక లంక గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పవన్కళ్యాణ్ మాట్లాడుతూ..ఉపాధి, వ్యవసాయ అవకాశాలు మెరుగుపరిచి, వలసలు ఆగే విధంగా అండగా నిలుస్తామన్నారు. గాజువాకలో స్టీల్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విశాఖపట్నం నగరాన్ని కాలుష్య కోరల నుంచి, కబ్జా కోరల నుంచి, మాఫియా బారి నుంచి కాపాడుతామని పవన్ హామీ ఇచ్చారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయ్యింది గానీ, భూములు ఇచ్చిన రైతులు మాత్రం వారి హక్కులు కోల్పోయారు. మీకు జనసేన పార్టీ న్యాయం చేస్తుంది. 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీలకి అండగా ఉన్నాం. మనకి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఓటేశాం. కానీ మన ఆశలు అడియాశలయ్యాయి. ఈ సారి మన ఓటు 25 కేజీల బియ్యం కోసమో, రెండు వేల నోటు కోసమో కాదని చాటుదాం. ఓటు కోసం నోటు ఇచ్చే వారి ముఖాన మీరే రెండు వేల నోటు తిరిగికొట్టే స్థాయి భవిష్యత్తు ఇచ్చేందుకు జనసేన పార్టీ ఉంది. 2019లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు కోరుకున్న వ్యక్తి పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.`` అని ప్రకటించారు.
``పవన్కళ్యాణ్కి రాజకీయం తెలియదు. జనసేనకి రాజకీయం తెలియదు అనే వారికి చెబుతున్నా... 130 మందికి పైగా అభ్యర్ధుల్ని శాసనసభకి నిలబెడుతు న్నాం. 25 ఎంపిల్లో 19 మందిని ఖరారు చేశాం. జనసేన పార్టీ నిలబెడుతున్న ఆ అభ్యర్ధులు మాములు వారు కాదు. `` అని వపన్ వెల్లడించారు. విశాఖ నుంచి నిలబెట్టిన ఎంపి అభ్యర్ధి సీటు ఇస్తే పారిపోయే వ్యక్తి కాదని, నిలబడే వ్యక్తిని తీసుకువచ్చామని పవన్ వెల్లడించారు. ``జనసేన మీకు అండగా ఉండాలి అంటే, పార్టీ నిలబడాలి అంటే అటువంటి ధైర్యవంతులే కావాలి. ఇది మార్పు కోసం జరుగుతున్న పోరాటం. భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. అలాంటి వ్యక్తుల అవసరం ఎందుకు కావాలి అంటే, ఇదే గాజువాకలో మనం టీడీపీ-బీజేపీలకి మద్దతు ఇస్తే గెలిచాక అంతా కబ్జాలమయం, భూదోపిడిలు, కుంభకోణాలమయం చేసేశారు. వీరి తాట తీయడానికే జేడీ లక్ష్మినారాయణని ఇక్కడిని నుంచి పోటీ చేయిస్తున్నా. క్రిమినల్ నాయకుల భరతం పట్టేందుకే విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి ఆయన్ని నిలబెట్టాం.`` అని పవన్ తెలిపారు.
``జేడీ వచ్చారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక రాదు. వైసీపీని గెలిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా. తెలుగుదేశం పార్టీ నేతల కబ్జాలు ఒక ఎత్తయితే, వీరు ఏకంగా మీ ఇళ్లు లాగేసుకుంటారు. కొండలు దోచేస్తారు. అందుకే అవినీతిని అంతమొందించడానికి విశాఖ నగరానికి ఒక కొత్వాల్గా జేడీని తీసుకువచ్చాను. అన్యాయం తోలు తీసే కొత్వాల్ ఆయన. డబ్బిచ్చి కిరాయి మూకల్ని తీసుకువస్తే వారికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే కొత్వాల్ కాబట్టే ఆయన్ని విశాఖకి ఎంపిక చేశాం. ఇప్పుడు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఆయన ఎదురుగా ఓట్లు అడుగుతారో.`` అంటూ వైసీపీపై విమర్శలు చేశారు.