హైదరాబాద్: పండుగ వాతావరణంలో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల శంఖుస్థాపనల కార్యక్రమాలను నిర్వహించాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజిల్లాలో పార్టీ కార్యాలయాల శంఖుస్థాపనలతో పాటు నిర్మాణ పనులు కూడా వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాకార్యాలయాల నిర్మాణాలు పూర్తి అయితే ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కారం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

 

జిల్లాస్థాయిలో ఉండే సమస్యలను జిల్లాస్థాయిలోని ప్రజాప్రతినిధులు పరిష్కరించి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి జిల్లానాయకులు తీసుకువస్తే ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికి మరింత వేగంగా అందేవిధంగా క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని కెటిఆర్ చెప్పారు.

 

ఇప్పటికే ప్రభుత్వం జిల్లాపార్టీ కార్యాలయాల నమూనాలు సైతం సిద్ధం చేసిందని చెప్పారు. అలాగే పార్టీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపులు కూడా జరిగాయని ఆయన వివరించారు. జిల్లాపార్టీ కార్యాలయాల నిర్మాణాలకు పార్టీ నుంచే నిధులు కేటాయించిన నేపథ్యంలో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు కెటిఆర్ చెప్పారు.

 

జిల్లాపార్టీ కార్యాలయాల్లో ప్రజా అవసరాలకు అనుకూలంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాఫిర్యాదులు, సమస్యల పరిష్కారం, జిల్లా స్థాయిలోని సంక్షేమపథకాల సమీక్షలు చేసేందుకు జిల్లా నాయకులకు పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: