ఏం జరిగింది..?
మహబూబ్‌నగర్‌ జిల్లా, వల్లబ్‌నగర్‌ ఎర్రగుట్ట ప్రాంతానికి చెందిన దంపతులు హద్దులమ్మ, యాదయ్య తమ పసిబిడ్డను పక్కన పెట్టుకొని గాఢనిద్రలో ఉన్నారు. ఉదయం లేచిన వారికి తమ పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టు పక్కల అడిగినప్పటికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు.
ఎవరు కారణం ?
ఈ సమయంలో ఎర్రగుట్ట సమీపంలో, వీరన్నపేటలోని లింగం హోటల్‌ సమీపంలో ఉన్న నిందితులు ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ సలీమ్‌, తస్లీమ్‌, మహిమూద్‌ అబ్దుల్‌, అహ్మద్‌లు కలిసి పసి బిడ్డను కిడ్నాప్‌ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అనుకున్నదే తడువుగా గాఢ నిద్రలో ఉన్న తల్లిదండ్రులను గమనించి ఎవరికి అనుమానం రాకుండా రెండు నెలల పసి బిడ్డను (ఆడ శిశువు) కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. .. బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఈ నెల 13న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరీ, పసికందును కిడ్నాప్‌ చేసిన నిందితులను నాలుగురోజుల్లోనే పట్టుకొని వ కటకటాల్లోకి నెట్టారు.

ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఎస్పీ ఛేదించి కిడ్నాప్‌కు గురైన పసికందును సురక్షితంగా శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో టాక్‌ ఆఫ్‌ ది టవున్‌ అయింది. జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరీ విలేకరుల సమావేశంలో కిడ్నాప్‌ నిందితుల వివరాలను వెల్లడించారు. ఎస్పీ రెమో రాజేశ్వరీ అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు దగ్గర స్పెషల్‌ టీంలను నియమించారు. అంతేకాకుండా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌లలో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను పంపింది.
ఎలా దొరికారు ? 
ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసులో వన్‌టౌన్‌ సీఐ రాజేష్‌ చాకచక్యంగా కేసును ఛేదించే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రుల నుంచి పాప పూర్తి వివరాలను సేకరించారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఆటోలతో సహా తనిఖీలు నిర్వహించారు. వీరన్నపేటలో ఎక్కువగా పోలీస్‌లను మప్టీలో ఉంచారు. ఈ నేపథ్యంలో వీరన్నపేటలోనే లింగం హోటల్‌ దగ్గర ఉన్న నిందితుల సమీపంలో పాప ఉన్న సంగతిని స్థానికులు పోలీసులకు చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

విచారణలో కిడ్నాప్‌ చేసింది తామేనని వారు ఒప్పుకున్నారని పోలీసులు అన్నారు. సంతానం లేని తల్లిదండ్రులకు పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నట్లు పోలీసుల ముందు వారు అంగీకరించారు. నిందితులను శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రెమా రాజేశ్వరీ మీడియా ముందు ప్రవేశపెట్టి పసికందును తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడంతో కిడ్నాప్‌ సుఖాంతం అయింది. తమ కూతురుని సురక్షితంగా నాలుగు రోజుల్లోనే కిడ్నాపర్ల చెర నుంచి కాపాడినందుకు ఎస్పీకి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: