భారతదేశంలో తెలుగు మీడియా రంగంలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ ఏ ప్రాంతీయ భాషల్లోనూ లేవు. రాజకీయ పార్టీల అవసరాల దృష్ట్యా తెలుగు మీడియా రంగంలో పుట్టగొడుగుల్లా ఛానల్స్ కు పుట్టుకు వచ్చేశాయి. 2004 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలకు ముందు ఓ శాటిలైట్ న్యూస్ ఛానల్ పెట్టేస్తున్నారు. తాత్కాలిక అవసరాల దృష్ట్యా ఈ ఛానల్స్ రన్ చేసి... ఎన్నికలు పూర్తయ్యాక వీటిని నడపలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగులో చాలా న్యూస్ ఛానల్స్ చేతులు మారిపోయాయి. కొన్ని ఛానల్స్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా వచ్చేసింది.
ఇటీవల కాలంలోనే విజయక్రాంతి పత్రిక మూత పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో న్యూస్ ఛానల్ సైతం మూత పడే దిశగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఛానల్ మూతపడటం లేదా చేతులు మారటం జరుగుతుందని తెలుగు మీడియా వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇంతకు ఆ ఛానల్ ఏంటో కాదు రాజ్ న్యూస్ ఛానల్. ఎన్నికలకు ముందు తమిళనాడు మేనేజ్మెంట్కు చెందిన ఈ ఛానల్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ లీజుకు తీసుకున్నారు. మొన్నటి మేతో ఈ లీజు ముగిసిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఎటు వెళ్లాలో తెలియక డైలమాలో ఉండడంతో ఇప్పుడు రాజ్ న్యూస్ ఛానల్ వదిలేసుకున్నారు.
వాస్తవానికి ఈ ఛానల్ టీ న్యూస్ పెట్టకముందు కేసీఆర్ టీం నడిపించింది. కోమటిరెడ్డి బ్రదర్స్ టేకోవర్ చేశాక అప్పటినుంచి వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టారు. కొత్త ఎక్వీప్మెంట్, ఫర్నిచర్, స్టూడియో సమకూర్చారు. అయితే సరైన ఎడిటోరియల్ టీం లేకపోవడంతో ఛానల్ కు సరైన పొలిటికల్ మైలేజీ రాకుండా పోయింది. దీంతో ఈ ఛానల్ను ఇప్పుడు అవసరాల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీయో లేదా నాయకులు తీసుకోవడం ఒక్కటే మార్గంగా కనపడుతోంది. లీజుకు తీసుకోవాలని చాలా మంది అనుకుంటున్నా ... ఈ ఛానల్ మేనేజ్మెంట్ అయిన తమిళీయులు లీజుకు ఇవ్వాలంటే ఎక్కువ రేటు చెపుతున్నట్టు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఈ ఛానెల్ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లీజుకు తీసుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత వెంకటకృష్ణ లీజుకు తీసుకుంటారన్న ప్రచారమూ జరిగింది. ఇక ఇప్పుడు వెంకటకృష్ణ తిరిగి 24*7 ఛానెల్కు వెళ్లిపోతున్నట్టు టాక్ బయటకు వచ్చింది. మరి ఇప్పుడు రాజ్ న్యూస్ ఛానెల్ను ఎవరైనా లీజుకు తీసుకుంటారా ? లేదా ? వదిలేస్తారా ? ఛానెల్ ఎలా రన్ అవుతుందన్నదన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెపుతుంది.