ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయిందో లేదో అప్పుడే టీడీపీ వర్గాలు విమర్శల దాడి ప్రారంభించాయి. నిన్న మొన్నటి వరకూ వారే అధికారంలో ఉన్న సంగతి మరచిపోయిన రాష్ట్రం అప్పుడే అభివృద్ధికి దూరమైపోయిందని విమర్శిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్, కొందరు ఇతర నేతలు రోజూ ట్వీట్ల మీద ట్వీట్లతో వైసీపీపై విరుచుకుపడుతున్నారు.
ఒక్కొక్కరు ఒక్కో అంశంపై ఓ ప్లాన్ ప్రకారం అన్నట్టుగా ట్వీట్లు పెడుతున్నారు. జగన్ పాలన రెండు నెలలైనా నిండకుండానే జోరు పెంచేశారు. ఈ జగన్ పాతుకుపోతే.. తమకు భవిష్యత్ ఉండదేమో అన్న బెంగ వారి మాటల్లో పరోక్షంగా కనిపిస్తోంది.
అయితే ఈ విమర్శలను వైసీపీ మంత్రులు కొందరు లైట్ గా తీసుకుంటుంటే.. మరికొందరు ఫైర్ అవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని టీడీపీకి అక్కసు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు.
ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో విప్లవాత్మక బిల్లులు పెట్టామని చెప్పారు.
టీడీపీ నేతల విమర్శలపై మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా మండిపడ్డారు. చంద్రబాబు ప్రైవేట్ విద్యకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు భూములు కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అప్పటి సీఎం చంద్రబాబు కార్పొరేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని మండి పడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నెల 5నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.