తాజా ఎన్నికల్లో ఏపీలో పలువురు టీడీపీ సీనియర్ల వారసులు సైతం మట్టికొట్టుకుపోయారు. పరిటాల, పూసపాటి, బొజ్జల, గాలి వారసులు ఓడిపోతే ఒక్క ఎర్రన్నాయుడు కుమార్తె మాత్రమే రాజమండ్రిలో గెలిచారు. ఇక కీలకమైన విజయనగరం జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా రికార్డులను తిరగరాస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో, జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముఖం చూపించలేని పరిస్థితి నెలకొంది.
పార్టీకి పట్టున్న కీలక నియోజకవర్గాలు సైతం చేజారిపోయేసరికి టీడీపీ క్యాడరంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యింది. పార్టీకి దశాబ్దాలుగా జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక గజపతిరాజు ఇంకా మౌనంగానే ఉండడం, జిల్లా నాయుకుల్లో నిరాశ కలిగిస్తోంది.మరీ వీరితో పోటీపడి రాజకీయాల్లో పూర్తిగా కొత్తయిన అశోక్ కుమార్తె అతిథి గజపతి, ఏవిధంగా పార్టీని బలోపెతం చేస్తారోనని టీడీపీ కేడరంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
విజయనగరం జిల్లాకు ఇంతవరకు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజు ఘోర పరాజయం పొందడంతో, ఆయన బయటకు రావడం మానేశారు. ఆయన మౌనం దాల్చడంతో కేడర్లో ఎవరు ఉత్సాహం నింపుతారన్న చర్చ ఆ పార్టీ నాయకుల్లో జరుగుతోంది. అతిథి గజపతి నాయకత్వాన్ని ఎంతమంది తెలుగు తమ్ముళ్ళు ఆదరిస్తారో జిల్లా ప్రజలు ఆమే నాయకత్వాన్ని ఎలా స్వీకరిస్తారన్నది సందేహంగానే ఉంది.
ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త. మరోవైపు జిల్లాలో వైసీపీ మాంచి జోరుమీదుంది. కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి బొత్స, డిప్యూటీ సీఎం శ్రీవాణి, పీడికల రాజన్నదొర ఇలా అందరూ ఉద్దండులే ఉన్నారు. ఇప్పటి వరకు బంగ్లాలో మహరాణిలా ఉన్న అతిథికి ఇప్పుడు అటు తన సొంత నియోజకవర్గంతో పాటు జిల్లాలో పార్టీని పటిష్టం చేయడం... తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయడం పెద్ద సవాల్గా మారింది. మరి ఆమె పొలిటికల్ అడుగులు ఎలా ? ఉంటాయో ? చూడాలి.