తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా హుజూర్ నగర్లో చేసిన ప్రసంగం హాట్ టాపిక్ అయ్యింది. అయితే దాన్ని మీడియా వక్రీకరించిందని మంత్రి ఈటల అంటున్నారు. ప్రసంగంలోకి కొన్ని మాటలనే పదే పదే చూపుతూ తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేస్తున్నారని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది గులాబీ జెండానే.. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే అని చెబుతున్నారు. నిరాధారమైన వార్తలు వద్దు.. సోషల్ మీడియా సంయమనంతో ఉండాలంటూ ఓ ప్రకటన చేశారు.
ఆయన ఇంకా ఏమంటున్నారంటే... " హుజురాబాద్లో కాంగ్రెస్ నాయకుడు కాసిపేట శ్రీనివాస్ చేరిక సందర్భంగా నేను చేసిన ప్రసంగాన్ని కొన్ని వార్త ఛానళ్లు, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించాయి. ఇది సరికాదు. నేను గులాబీ సైనికుడిని. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరిననాటి నుంచి.. నేటి వరకు గులాబీసైనికుడినే. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఇటీవల కాలంలో కొన్ని వార్తపత్రికలు (దక్కన్ క్రానికల్)లో, సోషల్ మీడియాలో మా పార్టీ అంటే గిట్టనివాళ్లు, నా ఎదుగుదలను ఓర్వలేనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒక కులానికి ప్రతినిధిని అన్నట్టు, డబ్బులకు ఆశపడే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే నేను హుజురాబాద్లో మాట్లాడాను. చిల్లరవార్తలు వద్దని చెప్పాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికే నేను పది లక్షల కోళ్ల ఫారానికి యజమానినని చెప్పిన. కమలాపుర్ (ప్రస్తుత హుజురాబాద్) నియోజకవర్గానికి నన్ను పంపించి, ఇక్కడ పోటీచేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆర్ గారే. ఇదే విషయాన్ని కూడా చెప్ప. మేము గులాబీ సైనికులమని చెప్పిన.
రాజకీయాల్లో సంపాదించుకోవడానికి రాలేదు.. నేను పార్టలో, ఉద్యమంలో చేరేనాటికి పారిశ్రామికవేత్తనని చెప్పిన. ఓ పార్టీనాయకుడు ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై స్పందించాలని వేదికపై కోరడంతో ఆ పత్రికపై నేను చేసిన కామెంట్లపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇది సరికాదు. ఆనాడు పార్టీ మారాలని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అనేక రకాలుగా ఒత్తడి తెచ్చినా లొంగని వ్యక్తి ఈటల రాజేందర్. ఈ ఉద్యమ పుణ్యానే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపాలి, సోషల్ మీడియా సంయమనంతో ఉండాలి. నా ప్రసంగపాఠాన్ని పూర్తిగా చూడండి."