అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్.. చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు సర్కారు అడ్డోగోలుగా అవినీతికి పాల్పడిందని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. ఇప్పుడు దాన్ని నిరూపించే పనిలో పడ్డాడు. ఇప్పటికే చంద్రబాబు సర్కారు హయాంలో తీసున్న నిర్ణయాలన్నింటినీ విచారణ చేయిస్తున్నాడు జగన్.


ఇప్పుడు తాజాగా మారో విచారణకు జగన్ సర్కారు ఆదేశించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి భూముల వేలం వ్యవహారం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఉన్న ఈ భూములను చంద్రబాబు సర్కారు తక్కువ ధరకు కట్టబెట్టిందని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. ఇక ఈ భూముల వివరాల్లోకి వెళ్తే.. వాసిరెడ్డి వంశానికి చెందిన వెంకట లక్ష్మమ్మ అమరావతి పుణ్యక్షేత్రాన్ని దర్శించేవారి కోసం 1885లో ఈ సత్రాన్ని నిర్మించారు.


2016 మార్చి 28న టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది. రూ.22.44 కోట్ల ధర మాత్రమే పలికింది. అయితే ఇంత తక్కువ ధరకు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు అదనంగా మరో రూ.5 కోట్లు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకున్నారు.


అయితే దీనిపై ఇతర వేలంపాట దారులు అభ్యంతరం చెప్పారు. దీంతో మళ్లీ వేలంపాట నిర్వహించగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ సత్యనారాయణ బిల్డర్స్‌ తరపున శ్రీనివాసరెడ్డి, పద్మనాభయ్య రూ.60.30 కోట్లకు ఈ భూమిని దక్కించుకున్నారు. తాజాగా ఈ భూమిని తక్కువ ధరకే అంటే రూ.22.44 కోట్లకే వేలంలో అప్పగించేందుకు జరిగిన ప్రయత్నాలపై ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.


సత్రం భూముల వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలోనే ప్రకటించారు. దానికి అనుగుణంగా ఈ వ్యవహారంపై విజిలెన్స్‌,ఎన్‌ఫోర్సుమెంట్‌ విచారణకు ఆదేశిస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విచారణలో టీడీపీ అక్రమాలపై ఆధారాలు దొరికితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: