నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన ఓ సినిమా.. ఒక వైపే చూడు.. ఇంకోవైపు చూడాలనుకోకు.. మాడి మసైపోతావ్ అంటూ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఇప్పుడు చంద్రబాబు తన బావమరిది డైలాగ్ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలను ఊళ్లలో ఉండనివ్వడం లేదని.. తరిమికొడుతున్నారని చెబుతున్నారు.


అలాంటి వైసీపీ బాధితుల కోసం ఏకంగా గుంటూరులో ఓ శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అయితే.. టీడీపీ నేతలు తమపై దాడులు చేశారని వైసీపీ కార్యకర్తలు కూడా చెబుతున్నారు. టీడీపీ నేతలు ఓటమి అక్కసుతో రగిలిపోతున్నారని.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే కడుపు మంటతో భౌతిక దాడులకు దిగుతున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రోజు రోజుకు పచ్చ నేతల ఆగడాలు అధికమవుతున్నాయంటున్నారు.


తాజాగా.. సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఏ. కొండాపురంలోనూ టీడీపీ నేతల దాడిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. కొండాపురం గ్రామంలో వినాయకచవితి వేడుకలు వైయస్‌ఆర్‌సీపీ నేతలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, తాము చెప్పినట్లు నడుచుకోవాలని దాడికి పాల్పడ్డారు.


మరో ఘటనలో.... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామమైన కౌకుంట్ల గ్రామంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేశారన్న కారణంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడటంతో నలుగురు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు.


అలాగే.. సోమవారం.. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన దళిత, మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారు. అయితే చంద్రబాబు ఈ ఘటనల్లో దేనిపైనా ఇంతవరకూ స్పందిచనేలేదు. అంటే చంద్రబాబు కూడా కేవలం ఒకవైపే చూస్తారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: