చంద్రయాన్ 2 కోసం యావత్ భారత్ దేశం ఆసక్తిగా చూస్తోంది. ఇంకా చెప్పాలంటే.. యావత్ ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భారత ప్రధాని కూడా జాబిలిపై మన ప్రజ్ఞాన్ రోవర్ అడుగు పెట్టే శుభవేళ కోసం స్వయంగా నిరీక్షిస్తున్నారు. విక్రమ్ ల్యాండింగ్ను స్వయంగా ప్రధాని మోదీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి తిలకించనున్నారు.
ఈ నేపథ్యంలో బెంగళూరు ఇస్రో సెంటర్ లో మోదీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ దృశ్యాన్ని మోదీతో పాటు డెబ్బై మంది పాఠశాల విద్యార్థులు వీక్షించనున్నారు. చంద్రుడిని చూస్తూ ప్రజలు కూడా తమ అనుభూతిని తనతో పంచుకోవాలని, చంద్రయాన్ ఫొటోలతో తనకు ట్వీట్ చేయాలని, వాటిలో కొన్నింటికి తాను రీ ట్వీట్ చేస్తానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీ తెలిపారు.
ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరులోని శాటిలైట్ కంట్రోల్ సెంటర్ నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా పొందుపరచనుంది. యూట్యూబ్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఛానెల్ ద్వారా ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించవచ్చు.
చంద్రయాన్ –2 లోని విక్రం ల్యాండర్ మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతున్నాడు. ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా చెప్పొచ్చు. అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది . నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ను గురువారం నాటికి చంద్రుడికి 35 కిలోమీటర్లు దగ్గరగా.. 101 కిలోమీటర్లు దూరంగా ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్బిటర్ చంద్రుడికి 96 కిలో మీటర్లు దగ్గరగా..125 కిలోమీటర్లు దూరంగా ఉండే చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తోంది.
ఇక మిగిలింది ల్యాండర్ విక్రమ్ను చంద్రుడిపై దించడమే. ఈ తుది ఘట్టం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ను శనివారం తెల్లవారుజామున ఒంటి గంట 55 నిమిషాలకు చంద్రుడిపైకి విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత.. అంటే ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్య అందులోంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి 14 రోజులపాటు పరిశోధనలు చేయనుంది.