దేశంలో లంచగొండి తనం చాలా ఎక్కువైంది. అవినీతి అధికారులు పెరిగిపోయారు. కంచాల కొద్ది లంచాలను మేసే అధికారులు పెరిగిపోతున్నారు. ఈడి, సిబిఐ రైడింగ్ లో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజా పనుల కోసం నియమించబడిన ఉద్యోగులు లంచాలకు మరిగి చేతులు తడిపితేనే ఫైల్ ముందుకు కదలడం లేదు. ఈ పరిస్థితులలో మార్పులు రావడం లేదు. అవినీతి నిరోధక శాఖ దీనిపై దృష్టి పెట్టినా.. ప్రజలు పట్టించే వరకు వాళ్లకు తెలియడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అయ్యాయి.
ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల కంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఎక్కువ. అంతేకాదు, సెలవులు కూడా ఎక్కువుగా ఉంటాయి. ఉద్యోగంపై భరోసా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కదా ఎవరేమంటారులే అని ఒక ధీమా. ఆ ధీమాతోనే పనులు పెండింగ్ లో పెడుతూ వస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా అలాగే ఉండటంతో.. ఎవరేం చేయలేరులే అని చెప్పి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓ పనికోసం ఓ వ్యక్తి పాపం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ, పని కావడంలేదు.
పని కావాలంటే లంచం ఇవ్వాలని ఆ అధికారి కోరాడట. దీంతో సదరు వ్యక్తి తన దగ్గర డబ్బులు లేవని చెప్పి.. డబ్బుకు బదులుగా తన దగ్గర ఉన్న దున్నపోతునే తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని సిరోజ్ కు చెందిన భూపతి రఘుపంత్ సింగ్ అనే వ్యక్తి తన భూమికి సంబంధించిన పత్రాలకోసం కాళ్ళు అరిగేలా రెవిన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగాడట. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం కనిపించలేదు. పత్రాలు కావాలంటే 25వేలు లంచం ఇవ్వాలని అడిగాడు.
అయితే, ఆ డబ్బు తన దగ్గరలేదని, పని అయిన తరువాత ఏదోలా చూసి పంపుతానని అన్నాడు. కానీ, ఆ ఉద్యోగి అందుకు అంగీకరించలేదు. లంచం ఇస్తేనే పని జరుగుతుందని గట్టిగా చెప్పాడు. దీంతో, విసిగిపోయిన సింగ్, చేసేది లేక తన దగ్గర ఉన్న ఓ దున్నపోతును ఆఫీస్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ ఉద్యోగి కారుకు కట్టేశాడు. లంచం ఇవ్వడానికి తన దగ్గర దున్నపోతు తప్పించి మరేమి లేదని, ఆ దున్నపోతును తీసుకొని తనకు పని చేసిపెట్టాలని కోరారు. దీంతో ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అవినీతి అధికారం బయటపడింది. పై అధికారులు సదరు ఉద్యోగిపై కోపంగా ఉన్నారు.