ఏపీకి ప్రత్యేక హోదా.. ఇది కొన్నేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో బాగా వినిపించిన నినాదం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీ అయిన ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిందే అంటూ అప్పట్లో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సారధ్యంలో ఐదేళ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేశారు.


ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించింది. ప్రత్యేక హోదా నినాదం ఎత్తితే జైల్లో పెడతా అంటూ అప్పట్లో చంద్రబాబు హుంకరించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే ఏపీకి లాభదాయకమని వాదించారు. అందుకే ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్నవారిపై వివిధ రకాల కేసులు పెట్టారు. ఆ సమయంలోనే వైయస్‌ జగన్‌ సీఎం కాగానే ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు అయిన కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.


హామీ ఇచ్చినట్టుగానే.. ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసులు జగన్ ఉపసంహరించారు. కేసులు ఎత్తివేయాలని ఉత్వర్హులను రాష్ట్ర హోంశాఖ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో హోదా ఉద్యమ కేసులు ఎత్తివేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు కేసులు ఉపసంహరించుకోవడంతో ఉద్యమకారులు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


ప్రత్యేక హోదా అన్నది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చారు. అయితే వైయస్‌ జగన్‌ మొదటి నుంచి కూడా హోదాపై పోరాటం చేస్తునే ఉన్నారు. సీఎం కాగానే ఢిల్లీ వెళ్లిన వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా డిమాండును ప్రధానికి వినిపించారు. మొన్నటి ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వచ్చి ఉంటే.. ప్రత్యేక హోదా సాకారమయ్యే అవకాశం ఉండేది. కానీ బీజేపీకి ఫుల్ మెజార్టీ రావడంతో ఆ అవకాశాలు బాగా సన్నిగిల్లాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: