ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు పెద్దగా గుళ్లూ గోపురాలు అంటూ తిరగరు.. ఏవైనా ప్రత్యేక దినోత్సవాలో, పండుగలు,పబ్బాలు అప్పుడు తప్ప పెద్దగా దైవభక్తి చూపించరు. కానీ ఆయన హయాంలో మాత్రం హిందూ దేవుళ్లకు అన్యాయం జరిగిపోయిందట. చంద్రబాబు తన పాలనలో ప్రజలతో పాటు హిందూ దేవుళ్లను కూడా వేధించారట. టీడీపీ హాయంలో హిందూ దేవుళ్లకు నిలువనీడ లేకుండా పోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


పుష్కరాలు, రహదారుల విస్తరణ పేరుతో పలు హిందూ దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ, ఇతర అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజ్ వద్ద గల శనీశ్వర ఆలయ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ప్రజలు, హిందువులను, ఇతర మతస్తులను, బాధ పెట్టే విధంగా వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా టీడీపీ పాలన కొనసాగిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటున్నారు.


పుష్కరాల పేరుతో టీడీపీ ప్రభుత్వం విజయవాడ నగరంలో అనేక దేవాలయాలను కూల్చటం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో హిందూ సేవా సంస్థలతో కలిసి ఆలయాల నిర్మాణం కోసం వైసీపీ పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు హయాంలో కూల్చిన ఆలయాలను అదే చోట కానీ.. ఇతర ప్రాంతాలలో కానీ నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం నడుం బిగించిందని మంత్రి అన్నారు.


జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆలయాల పునః నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారన్నారు. శనీశ్వర ఆలయం వద్ద తొలగించిన సీతమ్మ వారి పాదాలను త్వరలో అక్కడే వాటి నిర్మాణం చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: