కోడెల మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని, రాజకీయ వేధింపులు, ఒత్తిడుల కారణంగానే అయన ఆత్మహత్య చేసుకున్నారని, అది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ రాజకీయ హత్యే అని చెప్పిన బాబు, ఇప్పుడు ఈ విషయంపై కంప్లైంట్ చేసేందుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు వెళ్తున్నారు. బాబు గవర్నర్ దగ్గరకు వెళ్తున్న విషయం తెలుసుకున్న వైకాపా ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు బాబుగారిని సూటిగా ప్రశ్నించారు.
గవర్నర్ దగ్గరకు బాబు ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నారు అని ప్రశ్నించారు. గత మూడు నెలలుగా కోడెలను మీదగ్గరకు రానిచ్చారా అని ప్రశ్నించారు. కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న విషయం తెలిసి కూడా ఆయన్ను పరామర్శించేందుకు వెళ్ళారా ? అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్ తరలించడం మీకు తెలిసి జరిగిందా ? తెలియకుండా జరిగిందా? అని ప్రశ్నించారు.
కోడెల ఫర్నిచర్ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదు? గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే – ట్యాక్స్ వసూలు చేశారా? లేదా? గత ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్ మీకు తెలిసే జరిగాయా? తెలియకుండా జరిగాయా? గత ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా? అని ప్రశ్నించారు. ప్రశ్నలకు బాబు ఎలాంటి సమాధానం చెప్తారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.
ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నర్సరావుపేటలోనూ భూ కబ్జాల మీద మీరు విచారణ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. కోడెల తాను చనిపోకముందు మీకు ఫోన్ చేసి.. అయ్యా.. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీరెందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు? కోడెల తన మరణానికి ఈ ప్రభుత్వ వేధింపులు కారణమని వాంగ్మూలం ఎప్పుడైనా ఇచ్చారా? కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలు ఇవి, అని ఎక్కడైనా పేర్కొన్నారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నలన్నింటికీ బాబుగారు సమాధానాలు చెప్తారా లేదంటే లైట్ గా తీసుకొని పక్కన పెడతారా చూడాలి.