వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా దూకుడును పెంచారు. దూకుడుగా వ్యవహరిస్తూ.. పధకాలు ప్రవేశపెడుతున్నారు. అంతే దూకుడుగా ఉంటూ ఆ పధకాలను అమలు చేస్తున్నాడు. దీంతో జగన్ పేరు మారుమ్రోగిపోతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ ను అభిమానించే వ్యక్తులు ఎక్కువయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలామంది వైకాపా జాయిన్ కావాలని చూస్తున్నారు. ఇటు తెలంగాణాలో కూడా జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నాయకులు కోరుకుంటున్నారు.
ఆ దిశగా జగన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారని కూడా సమాచారం. అయితే, వైకాపా, తెరాస పార్టీల మధ్య మంచి అనుబంధం ఉన్నది. ఇద్దరు ముఖ్యమంత్రులు తరచుగా కలుసుకుంటున్నారు. సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. ఈ సమయంలో జగన్ తెలంగాణ నుంచి పోటీ చేయడం అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. జగన్ పోటీ చేస్తారని ఇప్పట్లో అనుకోవడానికి వీలులేదు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో టిడిపి ఏదైనా పుంజుకుంది అనుకుంటే.. జగన్ తెలంగాణాలో అడుగుపెట్టొచ్చు.
ఇదిలా ఉంటె, జగన్ కు బెంగళూరులో మంచి ఫాలోయింగ్ ఉన్నది. రాజశేఖర్ రెడ్డి ఉన్న రోజుల్లో జగన్ ఎక్కువుగా కర్ణాటకలోని ఉన్నారు. అక్కడే వ్యాపారాలు చేశారు. బెంగళూరులో ఆయనకు బలగం కూడా ఉన్నది. ఇది జగన్ కు కలిసి వచ్చే అంశంగా మారనున్నట్టు తెలుస్తోంది. వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పోటీ చేయబోతున్నట్టు సమాచారం. జగన్ పోటీ చేస్తారని, దానికోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
అక్కడి కాంగ్రెస్ నేతలు కూడా జగన్ కర్ణాటకలో పోటీ చేస్తే.. ఆ పార్టీలో చేరేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే కొంత మేర వైకాపా ఓటింగ్ సాధిస్తుంది. అందులో సందేహం అవసరం లేదు. ఒకవేళ వైకాపా పోటీకి దిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి.. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నది. జేడీఎస్ కొంతమేరకు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా.. ఆ పార్టీ అనుసరించిన విధానాల వలన జేడీఎస్ కు పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతలు కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండటంతో కాంగ్రెస్ కు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నది.