కమ్మ సామాజికవర్గం కోసమే నడిచే ’కమ్మ వైభవం’ అనే మ్యగజైన్ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ నెల ఎడిషన్లో  కోడెల పై వెలువడిన కథనం కలకలం రేపుతోంది. ఈ మ్యాగజైన్ కోడెల జీవించి ఉన్నపుడే మార్కెట్లోకి వచ్చింది. సామాజికవర్గంలోని చాలామందికి ఈ మ్యాగజైన్ చేరుతుంది.  కాబట్టి కోడెల కూడా ఈ మ్యాగజైన్ చదివే ఉంటారనటంలో సందేహం లేదు.

 

ఆ మ్యాగజైన్ లో అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నపుడు కోడెల అవినీతికి పాల్పడినట్లుంది. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొడుకు, కూతురు అరాచకాలకు పాల్పడినట్లు రాశారు. కొడుకు, కూతురు చేసిన అరాచకాలు వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదని చంద్రబాబునాయుడు హయాంలోనే వెలుగులోకి వచ్చినట్లు స్పష్టంగా చెప్పింది.  

 

కోడెల కొడుకు, కూతురు అరాచకాలను సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోని టిడిపి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని కూడా రాసింది. మంచి డాక్టర్ గా పేరున్న కోడెల స్పీకర్ గా బాధ్యతలు తీసుకోగానే అవినీతిపరుడైపోయినట్లు రాశారు. కొడుకు, కూతురు చేసిన అరాచకాలకు కోడెల మద్దతుందని కూడా ఆరోపించారు.

 

కోడెల లాంటి వారు పార్టీలో ఉంటే తెలుగుదేశంపార్టీకి చెడ్డ పేరే తప్ప మంచిపేరు రాదని పై రెండు నియోజకవర్గాల్లోని నేతలు, ప్రజలే చెప్పుకుంటున్నారని చెప్పింది. కోడెల లాంటి వారి వల్లే పార్టీ నాశనమైపోయిందని తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్లు కూడా వివరించింది.  

 

కోడెల లాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ప్రక్షాళన చేస్తేనే పార్టీకి భవిష్యత్  ఆశాజనకంగా ఉంటుందని  సలహా ఇచ్చింది.  పార్టీ సంగతి పక్కన పెట్టినా కోడెల లాంటి అక్రమార్జనపరుల కారణంగా  కులానికి కూడా చెడ్డ పేరొస్తోందని కమ్మ సామాజికవర్గమే భావిస్తోందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.  సొంత సామాజికవర్గమే ఛీ కొడుతున్న కోడెల లాంటి వారిని చంద్రబాబు ఇంకా వెనకేసుకొస్తే ఏమవుతుందో విడమరచి చెప్పక్కర్లేదని కూడా కమ్మ వైభవం స్పష్టంగా చెప్పేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: