హైదరాబాద్ ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ గంటల తరబడి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు.. ప్రధానంగా శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు అంశం, విభజన సమస్యలపై చర్చించారు. గోదావరి జలాలను కృష్ణాజలాలతో అనుసంధానం చేసే అంశంపై చాలా సేపు చర్చ జరిగింది.


వీలైనంత తక్కువ భూసేకరతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలించే విషయంతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాల పై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం ప్రగతి భవన్ లో సుదీర్ఝ చర్చ జరిపారు.


గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి, ఎలా తరలించాలి, అలైన్ మెంట్ ఎలా వుండాలి? అనే విషయాలు చర్చించారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా వుండే విధంగా జలాల తరలింపు, నీటి వినియోగం వుండాలని కేసీఆర్, జగన్ నిర్ణయించారు. దీనికోసం రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు.


ప్రధాన అంశం గోదావరి జలాల సద్వినియోగమే అయినా.. మరిన్ని అంశాలు చర్చకు వచ్చాయి. విద్యుత్, పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఇద్దరు సిఎంలు చర్చించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.


తెలంగాణ రాష్ట్రంలో 18వేల మంది పోలీసులను ఒకే సారి నియమిస్తున్నందున అందులో 4వేల మందికి ఆంధ్రప్రదేశ్ లో శిక్షణనివ్వాలని కేసిఆర్ ఏపి ముఖ్యమంత్రిని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. పోలీసులకు ఒకే సారి శిక్షణనివ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: