40 ఏళ్ల సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబు తన ఐదేళ్ల పాలన ద్వారా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన అవసరమైన చోట్ల ఖర్చు చేయకుండా దుబారా చేశారని మండిపడుతున్నారు. చంద్రబాబు అవినీతి, దుబారా ఖర్చులతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మున్సిపల్‌ శాఖలోనే రూ. 15 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు.


సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ప్రచార ఆర్భాటాలకు చంద్రబాబు వందల కోట్ల రూపాయలను వృథా చేశారని, చంద్రబాబు తీరు వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కృషిచేస్తున్నారన్నారు.


ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజారంజక పాలన చేస్తున్న మా ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు సరికాదని సూచించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీ విధానంతో సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి అన్నారు. సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.


అయితే వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాటల్లో కొంత వరకూ వాస్తవం ఉండొచ్చు..కానీ ఈ మాటలు ఎక్కువ కాలం ప్రజలను ఆకట్టుకోలేవు.. చంద్రబాబు పాలన బాగా లేదనే కదా.. చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపింది.. ఇప్పుడు ఇక వైసీపీ పాలన వచ్చింది.


ఇకపై మీరు చేసేది ఏంటి.. మీ పాలన ఎంత బాగా వుంటుంది అనేదే ప్రజలు చూస్తారు. ప్రజలకు అల్టిమేట్ కావాల్సింది ఫలితాలు అంతే తప్ప.. విమర్శలు కాదు. కాబట్టి ఇక వైసీపీ మంత్రులు గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే కార్యక్రమం కాస్త తగ్గించి.. తమ సామర్థ్యం చూపే పని ప్రారంభించాల్సిన సమయం వచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: