మంచి పేరున్న మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల భావిస్తారు. దీంతో పోటీ పడి మరి మంచి కాలేజీలో చేరాలనుకుంటారు విద్యార్థులు. అయితే మంచి పేరున్న కాలేజీలో చేరాలనుకునే విద్యార్థుల ఆశలను కొంత మంది ఆసరాగా తీసుకుంటున్నారు . మెడికల్ కళాశాలల్లో సీట్లు ఇప్పిస్తామంటూ లక్షల్లో కాదు ఏకంగా కోట్లలోనే విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత సీట్లు ఇప్పిస్తారా అంటే అదీ లేదు. ఇలాంటి ఘటనే ఇక్కడ జరిగింది.
బెంగళూరులోని ఆదిచెంచునగరి మెడికల్ కళాశాలకు మంచి పేరుంది. దింతో కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అందులో మెడికల్ సీట్ల కోసం ప్రయత్నాలు చేశారు. అయితే బెంగళూరుకు చెందిన ఇద్దరు కేటుగాళ్లు విద్యార్థుల ఆశలను ఆసరాగా తీసుకున్నారు. బెంగళూరు లోని ఆదిచెంచునగరి మెడికల్ కళాశాలల్లో సీట్లు ఇస్తామని ఆ ముగ్గురు విద్యార్థుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేస్తారు. లక్షల్లో కాదండోయ్ ఏకంగా 2కోట్ల వసూలు చేశారు. బెంగళూరుకు చెందిన కొమ్ము మునీశ్వర్ రెడ్డి, విజయ శంకర్ లు ఆ మొత్తాన్ని విద్యార్థుల నుంచి తీసుకున్నారు.
ఆ తర్వాత ఆదిచెంచుగిరి కళాశాలలో సీట్లు రాకపోవడంతో... విద్యార్థులు ప్రశ్నించగా... సప్తగిరి మెడికల్ కళాశాలలు సీట్లు ఇస్తామని విద్యార్థులకు చెప్పారు . దీని కోసం వాళ్ళ దగ్గరనుంచి ఇంకొంచెం ఫీజు కూడా వసూలు చేశారు. ఆ తర్వాత ఆ కళాశాలలో కూడా సీట్లు రాలేదు. అయితే మెడికల్ సీట్లు రాకపోవడంతో తాము చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడగడంతో... అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ముగ్గురు బాధితులు సోమవారం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా అడిగితే వాళ్ళు స్పందించడం లేదని తమకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధితులు పోలీసు అధికారులను వేడుకొన్నారు.