1992 డిసెంబర్ 6 వ తేదీన అయోధ్య విషయంలో మొదలైన రగడ ఇప్పటి వరకు కొనసాగవుతూనే ఉన్నది. అంతేకాదు, అంతకు ముందు కూడా రామ్ జన్మభూమి, బాబ్రీ మజీద్ విషయంలో గొడవలు ఉన్నా.. 1992 తరువాత ఈ గొడవ మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. యూపీ అలహాబాద్ కోర్టు దీనిపై గతంలో తీర్పు ఇచ్చింది. కానీ, సుప్రీం కోర్టులో కేసు ఫైల్ కావడంతో సుప్రీంలో వాదనలు జరిగాయి.
ఆగష్టు 6 వ తేదీ నుంచి అక్టోబర్ 16 వ తేదీ వరకు దాదాపు 40 రోజులపాటు దీనిపై వాదనలు జరిగాయి. ఐదుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ వాదనలు విన్నది. చివరి రోజున సాయంత్రం ఐదు గంటల వరకు వాదనలు వినాల్సి ఉండగా గంట ముందుగానే వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 4 వ తేదీ నుంచి నవంబర్ 15 వ తేదీ లోపుగా ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నది అందరిలోను ఉత్కంఠత నెలకొన్నది.
ఈ గొడవ మొత్తం వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి కోసమే జరుగుతున్నది. దీనిని సుప్రీం కోర్టు రామ్ మందిరం, బాబ్రీ మజీద్ కు సంబంధించిన కేసుగానే కాకుండా, ఒక వివాదాస్పద భూవివాదంగా కూడా ఆలోచిస్తోంది. ఈ వివాదాస్పద భూమి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది చూడాలి. కోర్టు తీర్పు ఏ రోజున చెప్పబోతున్నారు అన్నది ముందుగానే చెప్తారు కాబట్టి దానికి తగినట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
సున్నితమైన ప్రాంతాలు అన్ని చోట్లా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ కాబట్టి, దీనిపై మరో చోటికి వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకే అందరికి ఆమోదయోగ్యమైన, న్యాయపరమైన తీర్పును ఇవ్వాలి. దాని వలన ఇరు వర్గాల వారికీ మధ్య గొడవలు తలెత్తకుండా చూడాలి. ఇది న్యాయస్థానంతో పాటు అటు ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రభుత్వం దేశంలో ఎక్కడా గొడవలు జరగకుండా చూసుకోవాలి. అక్కడి రాష్ట్రప్రభుత్వాలతో అనుసంధానం అయ్యి భద్రతా ఏర్పాట్లు చేయాలి. తీర్పు కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. నెలరోజుల లోపుగానే తీర్పు వచ్చే రాబోతున్నది.