కొంతకాలం క్రితం వరకు గ్రామాల్లో, మండలాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఎయిడ్స్ గురించి, సుఖ వ్యాధులపై అవగాహనా గురించి విస్తృతంగా ప్రచారం చేసేవారు. ఆశా వర్కర్లు, ఇతర సామాజిక వేత్తలు వీటిపై అవగాహనా కల్పించేందుకు నిత్యం ప్రయత్నించేవారు. ముఖ్యంగా నిరక్షరాస్యులలో ఎయిడ్స్ పైన అవగాహనా పెంచేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్టు తెలుస్తున్నది.
ఒకప్పుడు కండోమ్స్ అంటే అందరూ ఒకలా చూసేవారు.. వాటిని బహిరంగంగా కొనుగోలు చేయడం అంటే ఇబ్బందిపడేవారు. ఎవరు ఏమనుకుంటారో అని పదేపదే ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు. అందరికి అవగాహనా ఉన్నది. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన పెంచుకున్నారు. అవగాహన పెంచుకోవడమే కాదు.. వాటిని ఎక్కువగా కూడా ఉపయోగిస్తున్నారు.
దీనిపై ఇటీవలే ఓ సర్వే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువుగా కండోమ్స్ ఉపయోగిస్తున్నారు అనే దానిపై జరిగిన సర్వేలో అనేక విషయాలు బయటపడ్డాయి. తెలంగాణలో కంటే.. ఆంధ్రప్రదేశ్ లోనే కండోమ్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారట. ప్రతి 10,000 మంది దంపతుల్లో ఏపీలో 1,404 మంది కండోమ్లను వినియోగిస్తుండగా.. తెలంగాణలో 501 మంది వినియోగిస్తున్నట్లు పేర్కొంది. దేశ రాజధాని దిల్లీలో 309 మంది మాత్రమే వీటిని వినియోగిస్తుండగా, దేశంలోనే అత్యల్పంగా గోవాలో ప్రతి 10,000 మంది దంపతుల్లో 268 మందే వీటిని వాడుతున్నారని నివేదికలు చెప్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటె, ఆంధ్రప్రదేశ్ లో గతేడాది 6 కోట్ల కండోమ్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచగా దాదాపు 78 శాతం వినియోగించినట్టు నివేదికలు చెప్తున్నాయి. అయితే, తెలంగాణలో గతేడాది 1.8 కోట్ల కండోమ్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచగా, దాదాపు 80 శాతం వీటిని వినియోగించినట్టుగా తెలుస్తోంది. అయితే, వివిధ రకాల ఫ్లేవర్స్ లో ఉండే కండోమ్స్ ను వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో తేలింది.