ఏపీ సీఎంగా
జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ మొహమాట పడకుండా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే
జగన్ తాజాగా జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులని మార్చేశారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే ఇలా ఇన్ చార్జ్ లని మార్చడం షాకింగ్ అనే చెప్పాలి. పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని
వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అయితే ఈ ఇన్ చార్జుల మార్పులో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి శ్రీకాకుళం
జిల్లా బాధ్యతలు అప్పగించారు.
అంతకముందు ఈ జిల్లాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇన్ చార్జ్ గా ఉండేవారు. ఆయన్ని విజయనగరానికి పంపి...శ్రీకాకుళం బాధ్యతలనీ కొడాలికి అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు ఇన్ చార్జ్ గా కొడాలిని నియమించడం వెనుక
జగన్ కు పెద్ద వ్యూహమే ఉంది. రాష్ట్రం మొత్తంలో మిగతా జిల్లాల్తో పోలిస్తే శ్రీకాకుళంలో
టీడీపీ పరిస్తితి కాస్తా మెరుగ్గానే ఉంది. ఇక్కడ
టీడీపీ రెండు సీట్లే గెలిచిన....బలమైన నాయకులు ఉన్నారు. అందులోనూ
బీసీ వర్గాలు బాగా మద్ధతు ఇస్తున్నాయి.
ఏపీ
టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం
ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శివాజీ, గౌతు శిరీష, కూన
రవికుమార్,లు లాంటి బలమైన నాయకులు ఉన్నారు. పైగా ఇక్కడ వైసీపీలో అంతర్గత విభేదాలు బాగా ఉన్నాయి. అటు జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ నిదానంగా ఉంటారు. ఇక మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవి దక్కలేదని సైలెంట్ అయిపోయారు. ఈ పరిస్థితులని గమనిస్తే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి కొంత ఇబ్బంది ఎదురయ్యే పరిస్తితి ఉంది.
ఈ పరిస్థితిని అధిగమించడానికే
జగన్ బలమైన నాయకుడు కొడాలి నానిని ఇన్ చార్జ్ గా నియమించారు. పైగా కొడాలికి-అచ్చెన్నాకు అసలు పడదు. వీరిద్దరు చాలాసార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు కూడా. దీంతో ఇన్ చార్జ్ గా కొడాలితో...అచ్చెన్నాతో పాటు, టీడీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అలాగే వైసీపీలోని విభేదాలని సరిదిద్ది స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలని కొడాలికి
జగన్ పెద్ద టాస్క్ ఇచ్చారు. మరి చూడాలి కొడాలి
జగన్ ఇచ్చిన టాస్క్ ఏ మేర సక్సెస్ అవుతారో ?