వైఎస్ జగన్ ఏపీ సీఎం అయినదగ్గర నుంచి రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవుతోంది. అటు కృష్ణా,ఇటు గోదావరి పొంగిపొర్లుతున్నాయి. కృష్ణాలో అయితే వరుసగా ఎనిమిదోసారి శ్రైశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇదంతా జగన్ కారణంగానే సాధ్యమైందా.. ముఖ్యమంత్రిని బట్టి వర్షాలు కురుస్తాయా.. అవునంటున్నారు కొందరు వైసీపీ నేతలు.
రాజ్యాన్ని పాలించే రాజు మంచివాడు, సద్గుణుడు అయితే ప్రకృతి కూడా సహకరిస్తుందని పురాణాలు చెబుతున్నాయని, గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో అది నిరూపణ అయ్యిందని, మళ్లీ ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వరుణుడు కరుణించాడని వైసీపీ ఎంపీ బాలశౌరి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుందని అన్నారు. గన్నవరం మండలం సూరంపల్లిలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భవన ప్రారంభోత్సవ సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూరంపల్లిలో సీపెట్ ఏర్పాటు మంచిపరిణామం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని ప్రారంభోత్సవ సభకు హాజరైన కేంద్రమంత్రి సదానందగౌడ్ను కోరారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే వర్షాలు బ్రహ్మాండంగా కురిసాయని, 20 సంవత్సరాలుగా నిండని డ్యాములన్నీ జలకళతో ఉన్నాయని, కృష్ణానది నుంచి దాదాపు 650 టీఎంసీలు సముద్రంలోకి పంపించామని కేంద్రమంత్రికి కన్నడలో వివరించారు. సీఎం వైయస్ జగన్ పాలనలో పులిచింతల ప్రాజెక్టు నిండిందన్నారు.
రైతులు రెండో పంటకు సిద్ధంగా ఉన్నారని, దానికి సంబంధించి ఎరువులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని గుర్తుచేశారు. అదే విధంగా రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టులు ఉన్నాయని, కోల్ కేటాయించాలని కోరారు. పెట్రో కారిడార్ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఈ విషయంలో కూడా సహకరించాలని ఎంపీ బాలశౌరి కన్నడ భాషలో కేంద్రమంత్రిని కోరారు.