ఇపుడు
ఏపీ రాజకీయాల్లోనె హాట్ టాపిక్ గన్నవరం. అదిపుడు గరం గరం అంటోంది. ఎందుకో అందరికీ తెలిందే. గన్నవరం ఫైర్ బ్రాండ్
టీడీపీ ఎమ్మెల్యే, తాను జన్మలో
జగన్ పార్టీలోకి వెళ్ళను అని బల్ల గుద్ది మరీ చెప్పిన
వల్లభనేని వంశీ ఇపుడు జెండా మార్చే పనిలో బిజీ గా ఉన్నట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. చంద్రబాబు పంపించిన ఇద్దరు
సీనియర్ టీడీపీ నాయకులు వంశీతో నెరిపిన రాయబారం విఫలమైందని వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఉప ఎన్నికల మీదనే అందరి ద్రుష్టి ఉంది.
దీపావళి రోజున వాట్సప్ సందేశం ద్వారా తన
రాజీనామా లేఖను పంపించిన
వంశీ నాగుల చవితికి వచ్చేసరికి మాత్రం కొంత వరకూ క్లారిటీ ఇచ్చేసినట్లుగా భోగట్టా. తాను మళ్ళీ టీడీపీలో కొనసాగే ప్రసక్తి లేదని
వంశీ తన వద్దకు వచ్చిన రాయబారులకు స్పష్టం చేశారని అంటున్నారు. దీంతో
వంశీ వైసీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. మరో వైపు
వంశీ జగన్ సమక్షంలో కండువా కప్పుకునే ముహూర్తం కూడా ఖరారు అయినట్లుగా చెబుతున్నారు.
నవంబర్ 3, లేదా 4వ తేదీన
వంశీ వైసీపీలో చేరుతారు అంటున్నారు. అపుడే ఆయన తన
రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్ లో తమ్మినేని సీతారాంకి పంపుతారని చెబుతున్నారు. ఇక స్పీకర్ రాజీనామాపై నిర్ణయం తీసుకుని దాన్ని ఎన్నికల సంఘానికి తెలియచేసిన మరుక్షణం ఏపీలో ఉప ఎన్నికల నగరా మోగనుంది.
.
అయితే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా కాకుండానే ఉప ఎన్నిక అంటే బాగోదు కాబట్టి మంచి సమయం చూసుకుని
జగన్ ఆలోచనల మేరకే
రాజీనామా ఆమోదం ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే
వంశీ రాజీనామా తరువాత వచ్చే ఉప ఎన్నిక కొత్త ఏడాది మార్చిలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి అప్పటికి
టీడీపీ పొలిటికల్ గా ఏమైనా సర్దుకుంటుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి ఇప్పటివరకూ ఉన్న సమాచారం చూస్తే
వంశీ సైకిల్ దిగిపోతున్నారనే అంటున్నారు.