ఆంధ్రులకు పౌరుషం ఉంది. వారికి
చరిత్ర ఉంది. ఒక ఉనికి ఉంది. అయితే తమ ప్రస్థానంలో కొన్ని సార్లు దెబ్బతిన్నారు, ఇబ్బందులు పడ్డారు. ఓడిపోయారు. మరికొన్ని సార్లు గెలిచారు. అయినా కూడా
చరిత్ర గొప్పది. ఘనమైనది. ఏదో జరిగిందని చరిత్రను మరచిపోవాలా. లేక సంకుచిత రాజకీయాల కోసం మొత్తం ఆంధ్రుల గర్వాన్ని, గౌరవాన్ని పక్కనపెట్టేయాలా. గత అయిదేళ్ళుగా అదే జరిగింది. ఇపుడు మాత్రం దానికి దుమ్ము దులిపి ఆంధ్రుల పౌరుషాన్ని మరో మారు గుర్తు చేస్తున్నారు జగన్.
నవంబర్ 1 అంటే అందరికీ గుర్తుకువచ్చేది ఆంధ్ర రాష్ట్ర అవతరణ. మరి దానికి చాలా ఏళ్ళుగా తద్దినం పెట్టేశారు నాటి ఏలికలు. చివరిసారిగా 2013లో అప్పటి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఈ ఉత్సవాలు జరిగాయి. అయితే దీనికి కేవలం
ఏపీ మంత్రులే హాజరయ్యారు. మరో వైపు తెలంగాణా ఉద్యమం వూపందుకున్న సందర్భం ఉంది. దాంతో వారంతా ముఖం చాటేసారు. ఇక
నవంబర్ 1న నిరశనలు కూడా చేపట్టారు. అవన్నీ గతం అనుకుంటే చంద్రబాబు నవ్యాంధ్రకు
ముఖ్యమంత్రి అయిన తరువాత అసలు అవతరణ ఉత్సవాలు చేయనేలేదు. జూన్ 2 నుంచి 8 వరకూ నవ నిర్మాణ దీక్షలు అంటూ అర్ధం పర్ధం లేని కార్యక్రమాలు నిర్వహించారు.
జగన్ అధికారంలోకి రావడంతోనే అవతరణ వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, ఇపుడు ఏపీవ్యాప్తంగా ఉత్సవాలకౌ రంగం సిద్దమైపోయింది.
విజయవాడ ఇందిరాగాందీ స్టేడియంలో
నవంబర్ ఒకటిన జరిగే అవతరణ దినోత్సవాలకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి,
గవర్నర్ బీబీ హరిచందన్ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వేడుకల మొదటి రోజు హస్తకళలు, చేనేత కళల ప్రదర్శన, రెండో రోజు కూచిపూడి
నృత్య ప్రదర్శన, లలిత, జానపద కళల ప్రదర్శనలు,
సురభి నాటకాలు ప్రదర్శించబడతాయి. మూడవ రోజు తెలుగు సంప్రదాయలు, ఆహర ఉత్పత్తుల ప్రదర్శన జరగనుంది. మొత్తానికి మళ్ళీ అంధ్రుల గౌరవం ఇలా గొప్పగా ప్రదర్శితమవుతోంది. పొట్టి శ్రీరాములు త్యాగఫలితం మరో మారు ఈ తరానికి తెలియనుంది. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం ధైర్యం, శౌర్యం కూడా ఆంధ్రులు మరో మారు స్మరించుకోనున్నారు.